Madhya Pradesh: మధ్యప్రదేశ్​ లో దారుణం: ఆసుపత్రిలోనే రోగికి నిప్పుపెట్టిన దుండగుడు

  • అంతకుముందే అతడిపై దాడి చేసిన నిందితుడు
  • ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న బాధితుడు
  • కసి తీరక ఆసుపత్రికొచ్చి నిప్పు పెట్టిన వైనం
Man Set Ablaze a Patient in Madhya Pradesh Hospital

అంతకుముందే వాళ్లిద్దరి మధ్యా గొడవ జరిగింది. ఆ గొడవలో ఓ వ్యక్తి గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అంతటితో కసి తీరని మరో వ్యక్తి.. ఆసుపత్రికి పోయి చికిత్స పొందుతున్న వ్యక్తిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ లోని సాగర్ జిల్లాలోని బుందేల్ ఖండ్  మెడికల్ కాలేజీలో జరిగింది.

బాధితుడిని దామోదర్ కోరి, నిందితుడిని మిలాన్ మచ్చా రజాక్ గా పోలీసులు గుర్తించారు. నిప్పు పెట్టిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. గురువారం పెట్రోల్ బాటిల్, లైటర్ తో ఆసుపత్రిలోకి ప్రవేశించిన రజాక్.. ఆ పెట్రోల్ ను దామోదర్ కోరిపై పోసి నిప్పుపెట్టినట్టు స్పష్టంగా కనిపించింది. ఆ వెంటనే మంటలతో దామోదర్, అక్కడి నుంచి తప్పించుకునేందుకు రజాక్ ఎగ్జిట్ గేట్ వైపు పరుగెత్తారు.

ప్రస్తుతం దామోదర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలుస్తోంది. బాధితుడు చెప్పిన వివరాలు, సీసీటీవీ కెమెరాలో రికార్డయిన దృశ్యాల ప్రకారం నిందితుడు రజాక్ ను గోపాల్ గంజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు.

More Telugu News