SC Families: కరోనాతో ఇంటి పెద్దను కోల్పోయిన ఎస్సీ కుటుంబాలకు కేంద్రం అండ

NSFDC to issue loans to sc families who lost family head
  • ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షల రుణం
  • బాధిత కుటుంబాలను గుర్తించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు
  • నేటి నుంచి ప్రారంభం కానున్న గుర్తింపు ప్రక్రియ
కరోనా కారణంగా సంపాదించే ఇంటి పెద్దను కోల్పోయిన ఎస్సీ కుటుంబాలను ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీరికి 20 శాతం సబ్సిడీతో రూ. 5 లక్షల వరకు రుణం ఇవ్వడం ద్వారా వారి కుటుంబాలను తిరిగి నిలబెట్టనుంది. ఎస్సీ ఆర్థికాభివృద్ధి సంస్థ (ఎన్ఎస్ఎఫ్‌డీసీ) ద్వారా వీరికి రుణం అందనుంది. అందుకున్న రుణంలో 20 శాతం రాయితీ పోను మిగతా మొత్తాన్ని 6 శాతం వడ్డీతో వాయిదాల్లో బ్యాంకులకు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఇందుకు కొన్ని నిబంధనలు కూడా విధించింది.

మరణించిన వ్యక్తి వయసు 18 నుంచి 60 ఏళ్ల మధ్య ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం రూ. 3 లక్షలకు మించకూడదు. కుటుంబంలో తల్లిదండ్రులు మరణించినా, సంపాదించే వ్యక్తి మరణించినా సాయం లభిస్తుంది. అయితే, కుటుంబ పెద్ద కొవిడ్‌తో మరణించినట్టు ధ్రువీకరణ పత్రం ఉండడంతోపాటు కుటుంబం మొత్తం అతడిపైనే ఆధారపడి ఉండాలి.

ఈ మేరకు ఇంటి పెద్దను కోల్పోయిన ఎస్సీ కుటుంబాలను గుర్తించి జాబితా పంపాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను (ఎన్ఎస్ఎఫ్‌డీసీ) కోరింది. ఈ నేపథ్యంలో నేటి నుంచి బాధిత కుటుంబాల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. రాష్ట్రంలో అర్హత ఉన్న కుటుంబాలను గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా గుర్తించాలంటూ ఏపీ ఎస్సీ కార్పొరేషన్ ఎండీ నవ్య నిన్న ఆదేశాలు జారీ చేశారు.
SC Families
NSFDC
Corona Virus
Loans

More Telugu News