Congress: యూపీలో కాంగ్రెస్‌కు ఊహించని ఎదురుదెబ్బ.. సీనియర్ నేత గుడ్ బై!

  • వచ్చే ఏడాది యూపీలో అసెంబ్లీ ఎన్నికలు
  • ఈ తరుణంలో పార్టీలో కీలక నేత జితిన్‌ గుడ్‌బై
  • కాంగ్రెస్‌లో ఉండి ప్రజల కోసం పనిచేయలేకపోతున్నానని వ్యాఖ్య
  • దేశంలో బీజేపీ ఒక్కటే జాతీయ పార్టీ అని అభిప్రాయం
Key leader in UP has left the congress

వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్‌ నేత జితిన్‌ ప్రసాద పార్టీకి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ సమక్షంలో ఆయన కమల తీర్థం పుచ్చుకున్నారు.

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి అత్యంత సన్నిహితంగా మెలిగిన జితిన్‌ 2019లోనే పార్టీని వీడుతున్నట్లు ఊహాగానాలు వినిపించాయి. కానీ, కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆయనకు నచ్చజెప్పినట్లు అప్పట్లో రాజకీయ వర్గాల్లో చర్చ నడిచింది. పార్టీ పనితీరుపై గత కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్న ఆయన ఎట్టకేలకు నేడు కాంగ్రెస్‌ను వీడారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లో ఉంటూ ప్రజల కోసం పని చేయలేకపోతున్నానని తెలిపారు. అలాంటప్పుడు పార్టీలో ఉండి ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు. దేశంలో ఉన్న నిజమైన రాజకీయ పార్టీ, జాతీయ పార్టీ బీజేపీ ఒక్కటేనని తాను భావిస్తున్నానన్నారు. రాహుల్‌ సన్నిహితుల్లో కాంగ్రెస్‌ను వీడిన రెండో వ్యక్తి జితిన్ ప్రసాద. గతంలో జ్యోతిరాధిత్య సింధియా సైతం బీజేపీ గూటికి చేరిన విషయం తెలిసిందే.

More Telugu News