VH: సీనియర్లతో చర్చించకుండా అధ్యక్షుడి నియామకం వద్దు: మాణికం ఠాగూర్‌కు వీహెచ్ లేఖ

  • మాణికం ఠాగూర్‌పై వీహెచ్ ధ్వజం
  • కేరళలో పార్టీ ఓడిన వెంటనే పీసీసీ చీఫ్‌ను మార్చేశారన్న వీహెచ్  
  • తనను దుర్భాషలాడుతున్నా పట్టించుకునే వారే లేరన్న వీహెచ్   
Congress Senior leader VH writes letter to manickam tagore

తెలంగాణ పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి నియామకం ఖాయమన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్‌లో మరోమారు కలకలం రేగింది. సీనియర్లతో చర్చించకుండా అధ్యక్షుడి నియామకం వద్దంటూ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణికం ఠాగూర్‌కు సీనియర్ నేత వి.హనుమంతరావు లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2014 నుంచి ఇప్పటి వరకు పార్టీలో అంతర్గత సమీక్ష అన్నదే జరగలేదని పేర్కొన్నారు. కేరళలో పార్టీ ఓటమి చెందగానే పీసీసీ చీఫ్‌ను మార్చేశారని, కానీ ఇక్కడ అలాంటి ఊసే లేదని విమర్శించారు.

మాణికం ఠాగూర్ పేరుకే రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ అనీ, కానీ ఇక్కడి వ్యవహారాలను ఆయన ఏమాత్రం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. 2023 ఎన్నికలే లక్ష్యంగా పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సీనియర్ నేత, పీసీసీ మాజీ అధ్యక్షుడినైన తనను దుర్భాషలాడుతున్నా పట్టించుకునే వారే లేరని హనుమంతరావు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి నిర్ణయం తీసుకుంటే అందరం కలిసి పనిచేస్తామన్న వీహెచ్.. తెలంగాణ పీసీసీ చీఫ్ ప్రకటనకు ముందు సీనియర్లతో మాట్లాడి అభిప్రాయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

More Telugu News