Corona Virus: 44 కోట్ల కరోనా టీకా డోసులకు కేంద్రం ఆర్డర్లు!

  • ఆగస్టు నుంచి అందుబాటులోకి
  • 19 కోట్ల కొవాగ్జిన్‌ డోసులు
  • 25 కోట్ల కొవిషీల్డ్‌ డోసులు
  • ఇప్పటికే 30 కోట్ల బయోలాజికల్‌-ఇ టీకా డోసులకు ఆర్డర్
44 crore vaccine doses have been ordered by centre

ఆగస్టు నుంచి 44 కోట్ల కరోనా టీకా డోసులు అందుబాటులోకి రానున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు ఆయా సంస్థలకు ఇప్పటికే ఆర్డర్లు ఇచ్చినట్లు తెలిపింది. 19 కోట్ల కొవాగ్జిన్‌ టీకా డోసుల కోసం భారత్‌ బయోటెక్‌కు.. 25 కోట్ల కొవిషీల్డ్‌ టీకా డోసుల కోసం సీరం ఇన్‌స్టిట్యూట్‌కు ఆర్డర్ పెట్టినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

మరోవైపు హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న బయోలాజికల్‌-ఇ రూపొందిస్తున్న కొవిడ్‌ వ్యాక్సిన్‌ 30 కోట్ల డోసులను ఇప్పటికే బుక్‌ చేసుకున్నట్లు కేంద్రం గతవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ టీకా వినియోగానికి ఇంకా అనుమతులు రావాల్సి ఉంది.

దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో కేంద్రమే అర్హులందరికీ ఉచితంగా టీకాలు అందజేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రధాని మోదీ సోమవారం ప్రకటన చేశారు. దీంతో వీలైనంత త్వరగా సార్వత్రిక వ్యాక్సినేషన్‌ను పూర్తి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. అందులో భాగంగానే భారీ మొత్తంలో టీకా డోసుల కోసం ఆర్డర్‌ చేసింది.

More Telugu News