G7 Summit: టీకా పాస్​ పోర్టులపై భారత్​ తీవ్ర నిరసన

India Opposes Vaccine Passports In G7 Health Ministers Meeting
  • జీ7 దేశాల ఆరోగ్య మంత్రుల సమావేశం
  • చాలా దేశాలు టీకాల్లో వెనకబడ్డాయన్న భారత్
  • టీకా పాస్ పోర్టులంటే వివక్షేనని కామెంట్
వ్యాక్సిన్ పాస్ పోర్టులపై భారత్ తీవ్ర నిరసన గళాన్ని వినిపించింది. అది అతిపెద్ద వివక్ష అని వ్యాఖ్యానిస్తూ, వ్యాక్సిన్ పాస్ పోర్టులను వ్యతిరేకించింది. ఈ ఏడాది జీ7 సదస్సుకు భారత్ ను అతిథిగా ఆహ్వానించారు. మరో వారంలో జరగనున్న ఈ సదస్సులో భాగంగా ఆయా దేశాల ఆరోగ్య శాఖ మంత్రులతో జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రి హర్షవర్ధన్ పాల్గొన్నారు.  

అయితే, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వ్యాక్సినేషన్ వేగంగా సాగట్లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి సందర్భాల్లో వ్యాక్సిన్ పాస్ పోర్టులు ఇవ్వడం మంచిది కాదన్నారు. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే.. పేద, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వ్యాక్సినేషన్ నెమ్మదిగా సాగుతోందన్నారు. అందుబాటు ధరల్లో వ్యాక్సిన్లు ఇవ్వడం, అందరికీ సమానంగా అందించడం, సురక్షితమైన ప్రభావవంత టీకాల సరఫరా వంటి సమస్యలను పరిష్కరించేంత వరకు వ్యాక్సిన్ పాస్ పోర్టులు వద్దని సూచించారు.

కాగా, కరోనా టీకాలు, ఔషధాలపై అంతర్జాతీయ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు జీ7 మంత్రులు ఏకాభిప్రాయానికి వచ్చారు. దాని వల్ల భవిష్యత్తులో ఇతర ఆరోగ్య సమస్యలపై వేగంగా స్పందించేందుకు, ఫలితాలను పంచుకునేందుకు వీలు చిక్కుతుందని అన్నారు.
G7 Summit
UK
India
Harsh Vardhan

More Telugu News