Kerala: అన్ని రాష్ట్రాలకు కేంద్రం ఉచితంగా టీకాలు పంపిణీ చేయాలంటూ కేరళ అసెంబ్లీ తీర్మానం

  • తీర్మానాన్ని ప్రవేశపెట్టిన మంత్రి వీణాజార్జ్
  • కరోనా బారి నుంచి అందరినీ రక్షించాలని కోరిన మంత్రి
  • తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించిన అసెంబ్లీ
Kerala Assembly passes resolution urging Centre for free universal vaccination

కరోనా కట్టడికి వేస్తున్న టీకాలను కేంద్ర ప్రభుత్వమే అన్ని రాష్ట్రాలకు ఉచితంగా పంపిణీ చేయాలన్న తీర్మానాన్ని కేరళ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. రాష్ట్ర ఆరోగ్య, శిశు సంక్షేమశాఖ మంత్రి వీణా జార్జ్ నేడు ఈ తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కరోనాపై జరుగుతున్న ఈ పోరులో భాగంగా అందరికీ ఉచితంగా సార్వత్రిక వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. టీకాలను ఉచితంగా అందించి అన్ని వర్గాల ప్రజలను ఈ మహమ్మారి బారి నుంచి రక్షించాల్సిన అవసరం ఉందన్నారు.

కరోనా వైరస్ గతేడాది దేశ ఆర్థిక వ్యవస్థను దారుణంగా దెబ్బతీసిందని, ఇప్పుడు సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో టీకా కార్యక్రమాన్ని వేగవంతం చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కేంద్రాన్ని కోరారు. ఫలితంగా ఆర్థిక వ్యవస్థకు కూడా మేలు జరుగుతుందన్నారు. కరోనా వైరస్ పోరులో ప్రతి ఒక్కరు కలిసి రావాలని పిలుపునిచ్చారు. కాగా, మంత్రి వీణా జార్జ్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని అధికార, ప్రతిపక్ష సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు.

More Telugu News