Pfizer: ఫైజర్ వ్యాక్సిన్ పై ఇజ్రాయెల్ ఫిర్యాదు.. సమీక్షిస్తామన్న ఫైజర్!

  • గతేడాది డిసెంబరు నుంచి ఈ ఏడాది మే మధ్య 5 మిలియన్ల మందికి ఫైజర్ టీకా
  • 275 మందిలో మయోకార్డిటిస్ లక్షణాలు
  • సమీక్ష నిర్వహిస్తున్నామన్న ఫైజర్
Israel Finds Probable Link Between Pfizer Covid Shot Myocarditis

ఫైజర్ వ్యాక్సిన్ వేయించుకున్న కొందరిలో గుండెలో మంటగా అనిపిస్తోందని తమ అధ్యయనంలో తేలిందని ఇజ్రాయెల్ పేర్కొంది. డిసెంబరు 2020 నుంచి మే 2021 మధ్య దేశంలో 5 మిలియన్ల మంది ఫైజర్ వ్యాక్సిన్ తీసుకుంటే, అందులో 275 మందికి మయో కార్డిటిస్ (గుండె మంట) లక్షణాలు కనిపించినట్టు ఇజ్రాయెల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఈ లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన వారు నాలుగు రోజులపాటు చికిత్స పొందినట్టు తెలిపింది. అయితే, ఈ కేసుల్లో 95 శాతం స్వల్ప స్థాయి లక్షణాలేనని పేర్కొంది. నిపుణులతో కూడిన మూడు బృందాలు నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైందని మంత్రిత్వశాఖ తెలిపింది.

వ్యాక్సిన్ రెండో డోసు తీసుకోవడానికి, మయోకార్డిటిస్ మధ్య సంబంధం ఉండొచ్చని ఈ అధ్యయనం అభిప్రాయపడిందని ప్రభుత్వం తెలిపింది. 16 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు వారిలో, మరీ ముఖ్యంగా 16 నుంచి 19 సంవత్సరాల మధ్య వయసు వారిలో ఈ లక్షణాలు కనిపించినట్టు తెలిపింది.  

ఇజ్రాయెల్ ప్రకటనపై ఫైజర్ స్పందించింది. టీకా తీసుకున్న వారిలో మయోకార్డిటిస్ లక్షణాలు కనిపించినట్టు తమ దృష్టికి వచ్చిందని, అయితే వ్యాక్సిన్‌కు, మయోకార్డిటిస్‌కు మధ్య సంబంధం ఉన్నదీ, లేనిదీ స్పష్టంగా తెలియదని, దీనిపై సమీక్ష జరుపుతామని తెలిపింది. ఈ విషయమై ఇజ్రాయెల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని వ్యాక్సిన్ సేఫ్టీ విభాగంతో సమావేశమై చర్చిస్తున్నట్టు ఫైజర్ వివరించింది.

More Telugu News