Chandrababu: మాగంటి బాబు మరో కుమారుడ్ని కూడా కోల్పోవడంతో నా గుండె బరువెక్కింది: చంద్రబాబు

  • ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబుకు పుత్రశోకం
  • రెండో కొడుకు రవీంద్రనాథ్ చౌదరి మృతి
  • తీవ్ర విచారం వ్యక్తం చేసిన చంద్రబాబు
  • ఇద్దరు కొడుకులను కోల్పోవడం బాధాకరం అంటూ వ్యాఖ్యలు
Chandrababu condolences to the death of Maganti Ravindranath

టీడీపీ మాజీ ఎంపీ మాగంటి బాబు రెండో కుమారుడు రవీంద్రనాథ్ చౌదరి హైదరాబాదులో అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం తెలిసిందే. ఇప్పటికే పెద్ద కొడుకు రాంజీ మృతి చెందగా, ఇప్పుడు రెండో కొడుకు కూడా చనిపోవడంతో మాగంటి బాబు కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు.

మాగంటి బాబు కుమారుడు రవీంద్ర మృతి బాధాకరమని పేర్కొన్నారు. రవీంద్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని తెలిపారు. మాగంటి బాబు ఇప్పటికే ఒక కుమారుడ్ని పొగొట్టుకుని పుత్రశోకంతో ఉన్నారని, ఇప్పుడు ఆయన మరో కొడుకును కూడా కోల్పోవడం చూసి గుండె బరువెక్కిందని అన్నారు.

కాగా, హైదరాబాదులోని పార్క్ హయత్ హోటల్లో కుమారుడు మరణించడం పట్ల ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రక్తపు వాంతులు చేసుకున్న స్థితిలో రవీంద్రనాథ్ చౌదరి మృతదేహాన్ని గుర్తించారు. మాగంటి బాబు ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

More Telugu News