Aanandaiah: ఆనందయ్య మందుకు పచ్చజెండా ఊపిన ఏపీ ప్రభుత్వం

  • ఏపీలో చర్చనీయాంశంగా ఆనందయ్య కరోనా మందు
  • సీసీఏఆర్ఎస్ అధ్యయనం
  • ప్రభుత్వానికి నివేదిక సమర్పణ
  • నివేదిక పరిశీలించిన పిదప అనుమతి  
AP Govt gives nod to Anandaiah corona medicine

కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆనందయ్య మందు ఎంతోమందిలో ఆశలు కల్పించిందనడంలో సందేహంలేదు. అయితే, ఈ మందుపై శాస్త్రీయ అధ్యయనం అవసరమంటూ పంపిణీని కొన్నిరోజుల పాటు నిలిపివేసిన ఏపీ ప్రభుత్వం... ఎట్టకేలకు అనుమతి మంజూరు చేసింది. సీసీఏఆర్ఎస్ (జాతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ) కమిటీ ఇచ్చిన నివేదికను పూర్తిగా పరిశీలించిన ప్రభుత్వం ఆనందయ్య మందు పంపిణీకి అభ్యంతరం లేదని తేల్చి చెప్పింది.

అయితే, ఆనందయ్య కుటుంబీకులు కంట్లో వేస్తున్న మందుకు మాత్రం అనుమతి ఇవ్వలేదు. దీనిపై కమిటీ నుంచి నివేదిక రావాల్సి ఉందని, నివేదిక పరిశీలన అనంతరం నిర్ణయం తీసుకుంటామని ఏపీ ప్రభుత్వం తెలిపింది. దీనికి మరికొంత సమయం పడుతుందని వెల్లడించింది. కాగా, సీసీఏఆర్ఎస్ నివేదికలో ఆసక్తికర అంశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఆనందయ్య మందు వాడితే కరోనా తగ్గుతుందని చెప్పలేమని కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. ఈ మందు వాడుతున్నంత మాత్రాన ఇతర మందులు ఆపొద్దని ప్రభుత్వం పేర్కొంది. అటు, ఆనందయ్య మందుపై హైకోర్టులో విచారణ ఈ మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా పడడం తెలిసిందే.

More Telugu News