Revanth Reddy: ఓటుకు నోటు కేసు: రేవంత్ రెడ్డిపై చార్జిషీటు దాఖలు చేసిన ఈడీ

  • ఆరేళ్ల తర్వాత ఈడీ చార్జిషీటు
  • 2015లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు
  • ఏసీబీ కేసు ఆధారంగా ఈడీ అభియోగాలు
  • చార్జిషీటులో ప్రధాన నిందితుడిగా రేవంత్ రెడ్డి
  • చంద్రబాబు పాత్రనూ ప్రస్తావించిన ఈడీ 
ED files charge sheet on Revanth Reddy

కొన్నేళ్ల కిందట సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది. సుదీర్ఘ విరామం తర్వాత కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చార్జిషీటు దాఖలు చేసింది. 2015లో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో స్టీఫెన్ సన్ కు రూ.50 లక్షలు ఇవ్వజూపాడంటూ రేవంత్ రెడ్డిపై ఏసీబీ కేసు నమోదు చేయగా, ఈ కేసు ఆధారంగా ఈడీ మనీ లాండరింగ్ అభియోగాలు మోపింది.

అప్పట్లో వీడియో ఆధారాలు బట్టబయలు కాగా, ఈ కేసులో రేవంత్ రెడ్డి కొంతకాలం జైలులో కూడా ఉన్నారు. బెయిల్ పై బయటికి వచ్చిన ఆయన టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేరారు.

కాగా, ఈ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు పాత్రపైనా ఏసీబీ విచారిస్తోంది. ఆయన స్టీఫెన్ సన్ తో మాట్లాడినట్టుగా భావిస్తున్న ఆడియో టేప్ ను ఫోరెన్సిక్ పరిశీలనకు పంపడం తెలిసిందే.

నేడు దాఖలు చేసిన చార్జిషీటులో రేవంత్ రెడ్డిని ప్రధాన నిందితుడిగా పేర్కొన్న ఈడీ... చంద్రబాబు పాత్రను కూడా ప్రస్తావించినట్టు తెలుస్తోంది. అప్పట్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగ్గా... టీడీపీ అభ్యర్థిగా రంగంలో ఉన్న వేం నరేందర్ రెడ్డికి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ చేసేందుకు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ప్రలోభాలకు గురిచేశారన్నది రేవంత్ రెడ్డి, తదితరులపై ఉన్న ప్రధాన అభియోగం.

More Telugu News