Baba Ramdev: బాబా రాందేవ్ కరోనా కిట్లకు హర్యానా గ్రీన్ సిగ్నల్

  • కరోనిల్ పేరుతో కోవిడ్ కిట్లను తయారు చేసిన పతంజలి 
  • ఈ మెడిసిన్ పై కొనసాగుతున్న వివాదం
  • లక్ష కిట్లను పంపిణీ చేస్తున్నట్టు ప్రకటించిన హర్యానా ప్రభుత్వం
Haryana To Give 1 Lakh Kits Of Ramdevs Coronil

ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ కు చెందిన పతంజలి సంస్థ కరోనా కోసం 'కరోనిల్' అనే ఔషధాన్ని తయారు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ మందు విశ్వసనీయతపై పలు అనుమానాలున్నాయి. దీనిపై వివాదం కూడా కొనసాగుతోంది.

మరోవైపు, కరోనిల్ ను కోవిడ్ పేషెంట్లకు పంపిణీ చేయాలని హర్యానా ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా బారిన పడిన వారికి ఉచితంగా ఈ కరోనిల్ కిట్ ను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని హర్యానా మంత్రి అనిల్ విజ్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.

హర్యానాలోని కోవిడ్ పేషెంట్లకు ఒక లక్ష పతంజలి కరోనిల్ కిట్లను పంపిణీ చేస్తామని అనిల్ విజ్ వెల్లడించారు. ఈ కిట్లకు అయ్యే ఖర్చును పతంజలి సగం భరిస్తుందని... మిగిలిన సగం ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు.

మరోవైపు, కరోనిల్ పై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఈ ఔషధాన్ని అశాస్త్రీయంగా కొట్టిపారేసిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో తమ మెడిసిన్ కు ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్టిఫికెట్ కూడా ఉందని రాందేవ్ వాదించారు. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో పతంజలి మెడిసిన్ కు హర్యానా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

More Telugu News