Black Day: ఎల్లుండి రైతుల ‘బ్లాక్ డే’.. పలువురు ముఖ్యమంత్రుల సహా ప్రతిపక్ష పార్టీల మద్దతు

  • ఈ నెల 26తో ఉద్యమానికి ఆరు నెలలు
  • బ్లాక్‌డేకు పిలుపునిచ్చిన ఎస్‌కేఎం
  • మమత, ఉద్ధవ్, స్టాలిన్, హేమంత్ సోరెన్‌ల మద్దతు
Opposition parties back farmers unions call to observe May 26 as Black Day

కేంద్రప్రభుత్వం గతేడాది తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులో రైతులు చేపట్టిన ఉద్యమం కొనసాగుతోంది. ఈ ఉద్యమానికి ఈ నెల 26తో ఆరు నెలలు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని 40 రైతు సంఘాలతో కూడిన సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) ‘బ్లాక్ డే’కు పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా రైతులు దేశవ్యాప్తంగా నిరసనలు తెలపనున్నారు. ఎస్‌కేఎం పిలుపునకు 12 ప్రతిపక్ష పార్టీలు మద్దతు పలికాయి. ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటనపై ఆయా పార్టీల నేతలు సంతకాలు చేశారు. ఇందులో పలువురు ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌తోపాటు కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ, ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్, సీపీఐ నేత డి.రాజా, సీపీఎం నేత సీతారాం ఏచూరి తదితరులు ఉన్నారు.

More Telugu News