Malaysia: మరో కరోనా వైరస్ ముప్పు.. శునకాల ద్వారా మానవుల్లోకి చొరబాటు!

  • మలేసియాలో వెలుగుచూసిన వైరస్
  • కొత్త వైరస్‌కు  ‘సీసీవోవీ-హెచ్‌యూపీఎన్-2018’  అని పేరు
  • సార్స్ కోవ్-2 తర్వాత మానవుల్లోకి వచ్చిన తొలి వైరస్
New coronavirus detected in patients in Malaysia it has come from dogs

కరోనా వైరస్‌లో రోజుకో కొత్త వేరియంట్ వెలుగుచూస్తున్న వేళ తాజాగా మరో రకం కరోనా వైరస్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు. మలేసియాలో వెలుగుచూసిన ఈ వైరస్ శునకాల నుంచి మానవుల్లోకి చొరబడి ఉంటుందని అనుమానిస్తున్నారు. అయితే, దీనివల్ల మనుషులకు జరిగే హానికి సంబంధించి ఇంకా ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. ఈ కొత్త వైరస్‌కు ‘సీసీవోవీ-హెచ్‌యూపీఎన్-2018’ అని పేరుపెట్టారు. కరోనా కారక సార్స్‌కోవ్-2 తర్వాత మానవుల్లోకి వచ్చిన వైరస్ ఇదేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

2017-18 మధ్య న్యూమోనియా బారినపడిన కొందరు బాధితుల నమూనాలను విశ్లేషించగా ఈ వైరస్ వెలుగుచూసినట్టు చెప్పారు. శునకాల్లోని కరోనా వైరస్‌ను మనుషుల్లో గుర్తించడం ఇదే తొలిసారని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ వైరస్ మానవుల నుంచి మానవులకు సోకుతుందా? అన్నది తేలాల్సి ఉంది. ఇలాంటి వైరస్‌లు రాత్రికి రాత్రే మహమ్మారిగా మారబోవని స్పష్టం చేశారు. తొలుత మనుషుల శరీరంలోని రోగ నిరోధకశక్తికి అనుగుణంగా సర్దుబాటు చేసుకుంటాయని, ఈ క్రమంలో ఇన్ఫెక్షన్ కలిగించడానికి ఎన్నో ఏళ్లు పడుతుందని శాస్త్రవేత్తలు వివరించారు.

More Telugu News