ponnambalam: ఆర్థికసాయం చేసిన చిరంజీవి... "అన్నయ్యా" అంటూ ఉద్వేగానికి లోనైన నటుడు పొన్నాంబళం

  • కిడ్నీ సమస్యతో బాధపడుతున్న పొన్నాంబళం
  • కిడ్నీ మార్చాలన్న వైద్యులు
  • ఆర్థికంగా బాగా దెబ్బతిన్న పొన్నాంబళం
  • రూ.2 లక్షలు బదిలీ చేసిన చిరంజీవి
  • ఆ డబ్బు బాగా ఉపయోగపడిందన్న పొన్నాంబళం
Ponnambalam thanked Chiranjeevi for his financial help

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సాటి నటుడి పట్ల పెద్ద మనసు ప్రదర్శించారు. ప్రముఖ దక్షిణాది నటుడు పొన్నాంబళం కిడ్నీ సమస్యతో బాధపడుతుండగా, ఆయన శస్త్రచికిత్స కోసం చిరంజీవి రూ.2 లక్షల ఆర్థికసాయం అందజేశారు. తమిళం, తెలుగు, తదితర భాషల్లో విలన్ గా, క్యారెక్టర్ నటుడిగా పొన్నాంబళం అందరికీ సుపరిచితుడే. చిరంజీవితోనూ ఆయన పలు చిత్రాల్లో నటించారు. తమిళ బిగ్ బాస్ షోలోనూ నటించి అభిమానులకు మరింత దగ్గరయ్యారు.

పొన్నాంబళం కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. కిడ్నీ మార్పిడి చేయాలని డాక్టర్లు తెలపడంతో తన ఆర్థికస్థితి అందుకు సహకరించక పొన్నాంబళం తీవ్ర వేదనకు గురయ్యారు. ఆయన పరిస్థితి తెలుసుకున్న చిరంజీవి రెండు లక్షల రూపాయలను ఆన్ లైన్ లో బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో, పొన్నాంబళం భావోద్వేగాలకు గురయ్యారు.

"చిరంజీవి అన్నయ్యా" అంటూ సంతోషం వెలిబుచ్చారు. మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. "మీ పేరులోనే ఆంజనేయస్వామి ఉన్నాడు, ఆయన మిమ్మల్ని చిరంజీవిగా ఉంచాలని కోరుకుంటున్నా... మీరు పంపిన డబ్బు నాకు చాలా ఉపయోగపడింది... ధన్యవాదాలు అన్నయ్యా... జై శ్రీరామ్" అంటూ ఓ వీడియో సందేశం వెలువరించారు.

More Telugu News