ayurveda: ఆనందయ్య కరోనా మందుపై కాసేప‌ట్లో సీఎం జ‌గ‌న్ కీల‌క‌ నిర్ణ‌యం

  • కృష్ణపట్నంలో కరోనాకి ఆనందయ్య ఆయుర్వేద మందు
  • అనుమ‌తి ఇవ్వాలా? వ‌ద్దా? అన్న అంశంపై కాసేప‌ట్లో సీఎం స‌మీక్ష
  • శాస్త్రీయ‌త‌, ప‌నిచేసే విధానాన్ని తెలుసుకోనున్న జ‌గ‌న్
  • మందుపై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ క్షేత్ర‌స్థాయిలో పరిశీల‌న  
jagan review on corona ayurveda medicine

ప్రపంచాన్ని వణికిస్తూ.. లక్షలాది మందిని పొట్టనపెట్టుకుంటున్న కరోనా మహమ్మారికి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని కృష్ణపట్నంలో ఆనందయ్య అనే వ్యక్తి ఇస్తున్న ఆయుర్వేద మందు అద్భుతంగా పనిచేస్తోందంటూ మీడియాలో పుంఖాను పుంఖాలుగా కథనాలు వస్తున్నాయి.

ఈ మందును తీసుకున్న తమకు కరోనా నుంచి విముక్తి కలిగినట్టు పలువురు రోగులు కూడా టీవీ ఛానెళ్లలో స్వయంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణపట్నానికి జనం పోటెత్తుతున్నారు. సదరు మందు కోసం ఏపీ నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా వేలాదిగా తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఈ ఆయుర్వేద మందు పంపిణీకి అనుమ‌తి ఇవ్వాలా? వ‌ద్దా? అన్న అంశంపై కాసేప‌ట్లో సీఎం జ‌గ‌న్ స‌మీక్ష నిర్వ‌హించ‌నున్నారు.

ఆయుర్వేద మందు శాస్త్రీయ‌త‌, ప‌నిచేసే విధానాన్ని తెలుసుకోనున్నారు. అధికారుల బృందం చేసిన ప‌రిశోధ‌న‌, నివేదిక‌పై చ‌ర్చించ‌నున్నారు. ఒక‌వేళ పంపిణీకి అనుమతి ఇస్తే ప్ర‌భుత్వ ప‌రంగా చేయాల్సిన ఏర్పాట్ల‌పై కీల‌క ప్ర‌క‌ట‌న చేసే అవకాశం ఉంది.

కృష్ణపట్నంలో కరోనాకి ఆనందయ్య ఆయుర్వేద మందు అందిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో ఇత‌ర‌ జిల్లాలు, రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో జనం వస్తుండ‌డంతో అక్క‌డ తీవ్ర‌ గంద‌ర‌గోళం నెల‌కొంది. దీంతో మందు పంపిణీని తాత్కాలికంగా అపేశారు.

మ‌రోవైపు ఆనంద‌య్య పంపిణీ చేసే మందుపై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ రంగంలోకి దిగి క్షేత్ర‌స్థాయిలో పరిశీల‌న చేస్తోంది. మందు ప‌నిచేసే విధానంపై వివ‌రాలు తీసుకుంటోంది. ఔష‌ధం శాస్త్రీయంగా నిరూపణ కావాల్సి ఉంద‌ని తెలిపింది. అంతేగాక‌, చికిత్స అనంత‌ర ప‌రిణామాల‌పై అధ్యయ‌నం చేయాల‌ని పేర్కొంది.

More Telugu News