Jagan: జగన్ అక్రమాస్తుల కేసు.. లేపాక్షి కేసులో విచారణ నిలిపివేయాలన్న బీపీ ఆచార్యకు చుక్కెదురు

  • లేపాక్షి నాలెడ్జ్ హబ్‌కు అనుచిత లబ్ధి చేకూర్చారని అభియోగాలు
  • మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరణ
  • కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐకి ఆదేశం
  • జూన్ 17కు విచారణ వాయిదా
Shock to BP Acharya in Lepakshi Case

జగన్ అక్రమాస్తుల కేసులో నిందితుడైన మాజీ ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్యకు చుక్కెదురైంది. అవినీతి నిరోధక చట్టం కింద నమోదైన అభియోగాలను విచారణ నిమిత్తం పరిగణనలోకి తీసుకుంటూ మార్చి 10న సీబీఐ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న ఆచార్య అభర్థనను తెలంగాణ హైకోర్టు తోసిపుచ్చింది.

అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(2) రెడ్‌విత్, 13(1) (డి) కింద ఆచార్యపై విచారణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. అయితే, కేంద్రం మాత్రం అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయాన్ని పునస్సమీక్షించాలని కేంద్రాన్ని కోరారు. కేంద్రం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో నిర్ణయం వెలువడే వరకు విచారణ నిలిపివేయాలని ఆచార్య గతంలో హైకోర్టును ఆశ్రయించి స్టే పొందారు.

అయితే, దాని గడువు మార్చి 10తోనే ముగిసింది. దీంతో ఆయన మరోమారు అదే కారణంతో హైకోర్టును ఆశ్రయించారు. అలాగే, సీబీఐ కోర్టు ఉత్తర్వులను కూడా కొట్టివేయాలని కోరారు. ఈ పిటిషన్‌ను నిన్న విచారించిన కోర్టు మధ్యంత ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. ఆచార్య పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశిస్తూ విచారణను జూన్ 17కు వాయిదా వేసింది.

అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో ఏపీఐఐసీ వైస్ చైర్మన్, ఎండీగా ఉన్న బీపీ ఆచార్య నిబంధనలకు విరుద్ధంగా లేపాక్షి నాలెడ్జ్ హబ్‌కు 8,841 ఎకరాలు కేటాయించడంతోపాటు భూములు తాకట్టు పెట్టి రుణాలు తీసుకునేందుకు కూడా అనుమతులిచ్చారని సీబీఐ అభియోగాలు నమోదు చేసింది.

More Telugu News