Janasena: అంకెల హంగామా, అభూత కల్పనలు, సీఎంను పొగడడం తప్ప ఇంకేమీ లేదు: ఏపీ బడ్జెట్ పై జనసేన స్పందన

  • బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏపీ సర్కారు
  • నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యలు
  • ఆత్మస్తుతితో నింపేశారని విమర్శలు
  • ప్రజల బడ్జెట్ కాదని స్పష్టీకరణ
  • వాస్తవిక దృష్టితో ఆలోచించాలని హితవు
Janasena opines on AP Budget

ఏపీ ప్రభుత్వం రూ.2.29 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో జనసేన పార్టీ స్పందించింది. బడ్జెట్ లో అంకెల హంగామా తప్ప ఇంకేమీలేదని, బడ్జెట్ ను అభూత కల్పనలు, ఆత్మస్తుతితో నింపేశారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. కరోనా కట్టడిలో దేశానికే ఆదర్శమని పొగుడుకున్నారని, కానీ వాస్తవాలేంటో ఒక్కసారి ప్రభుత్వాసుపత్రులకు వెళ్లి చూస్తే తెలుస్తుందని వ్యాఖ్యానించారు.

ఓవైపు ప్రాణాల కోసం ప్రజలు రోదిస్తుంటే, అసెంబ్లీలో సీఎంను పొగుడుతూ పద్యాలు, కొటేషన్లు చదువుతూ ప్రజలను మభ్యపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో తమది ఆదర్శ ప్రభుత్వమని చెప్పుకోవడం కన్నా హాస్యాస్పదమైన ప్రకటన ఇంకొకటి లేదని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ తన ఇంటిని వదిలి బయటికి వచ్చి ఓసారి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి పరిశీలించాలని నాదెండ్ల హితవు పలికారు. ప్రభుత్వం ఇంత ఆదర్శవంతమైన సేవలు అందిస్తుంటే రోగులు ఎందుకు ప్రైవేటు ఆసుపత్రులకు వెళుతున్నారని ప్రశ్నించారు.

ఆక్సిజన్ అందక ప్రాణాలు పోతున్నాయని, మందుల కొరత తీవ్రంగా ఉందని వివరించారు. ప్రస్తుతం రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థ విపత్తులో చిక్కుకుందని, ఈ ఏడాదే థర్డ్ వేవ్ కూడా వస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారని నాదెండ్ల అన్నారు. ఈ నేపథ్యంలో, ఏపీ సర్కారు వ్యవసాయ బడ్జెట్టులానే, ఆరోగ్య శాఖ నుంచి కూడా ప్రత్యేకంగా బడ్జెట్ రూపొందించి ఉంటే బాగుండేదని హితవు పలికారు. గతేడాది కంటే ఆరోగ్య అంశానికి ఎక్కువ ఇచ్చాం అని చెబుతున్నారని, కానీ కరోనా కట్టడికి కేటాయించిన మొత్తం చూస్తేనే వైసీపీ ప్రభుత్వ చిత్తశుద్ధి ఎంతో అర్థమవుతుందని విమర్శించారు.

సంక్షేమ కేటాయింపులు 32 శాతం పెంచామంటూ చెబుతున్నారని, కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సమగ్ర అభివృద్ధిని మాత్రం పట్టించుకోవడంలేదని నాదెండ్ల ఆరోపించారు. గత బడ్జెట్లో ఇచ్చిన నిధులను కూడా నవరత్నాలకు మళ్లించేశారని, దాంతో విదేశీ విద్యకు సంబంధించిన నిధులు విడుదల కాక, విదేశాల్లో చదువుకుంటున్న పేద బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, కాపు, బ్రాహ్మణ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. వాస్తవిక దృష్టితో ఆలోచించి ప్రజల బాధలకు అనుగుణంగా బడ్జెట్ తీసుకురావాల్సి ఉండగా, అందుకు వ్యతిరేకంగా తాజా బడ్జెట్ ప్రజల ఆకాంక్షలను ఏమాత్రం ప్రతిబింబించడంలేదని నాదెండ్ల విమర్శించారు.

  • Loading...

More Telugu News