USA: చైనా ఒలింపిక్స్​ ను బహిష్కరించండి: ప్రపంచ దేశాలకు అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్​ పిలుపు

  • ఊచకోతలు జరుగుతున్నాయన్న నాన్సీ పెలోసి
  • అక్కడికెళితే నైతికతను కోల్పోయినట్టేనని వ్యాఖ్య
  • మళ్లీ ఏ మొహం పెట్టుకుని ఊచకోతలపై మాట్లాడుతామని కామెంట్
  • స్పీకర్ కు మద్దతుగా మాట్లాడిన సభ్యులు
Nancy Pelosi Calls World Leaders To Shun China Winter Olympics Over Its Alleged Genocide

చైనాలో వచ్చే ఏడాది జరగబోయే శీతాకాల ఒలింపిక్స్ ను బహిష్కరించాలని అమెరికాతో పాటు ప్రపంచ దేశాల నేతలకు అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ పిలుపునిచ్చారు. మానవ హక్కులను చైనా కాలరాస్తోందని, ప్రపంచ నేతలెవరైనా ఒలింపిక్స్ కు హాజరైతే వారికి నైతిక విలువలు లేనట్టేనని అన్నారు.

కాంగ్రెస్ సమావేశాల సందర్భంగా ఆమె ఈ డిమాండ్ చేశారు. దేశాధినేతలు  ఒలింపిక్స్ కు వెళ్లి చైనాకు గౌరవం ఇవ్వకూడదన్నారు. ‘‘చైనాలో ప్రస్తుతం ఊచకోతలు కొనసాగుతున్నాయి. ఇలాంటి సమయంలో మనం అక్కడ జరిగే క్రీడా సంబరాలకు వెళ్లి కుర్చీల్లో కూర్చోవడమంటే మన నైతికతపై ప్రశ్నలు వేసుకోవాల్సి వస్తుంది. అక్కడికి వెళ్లొచ్చాక ప్రపంచ దేశాల ముందు చైనా ఊచకోతలపై ఏం మొహం పెట్టుకుని మాట్లాడుతాం?’’ అని ఆమె అన్నారు.

కాగా, ఆమె డిమాండ్ కు సభలోని చాలా మంది మద్దతు తెలిపారు. కార్పొరేట్ స్పాన్సర్లు కాంగ్రెస్ ముందు తమ నిజాయతీని నిరూపించుకోవాలని, వారు బాధ్యత వహించాలని రిపబ్లికన్ సభ్యుడు క్రిస్ స్మిత్ చెప్పారు. చాలా మంది వ్యాపారులకు చైనా ఊచకోతలు కనిపించట్లేదని, కేవలం వారికి డబ్బు సంపాదనే కావాలని అన్నారు. ఒలింపిక్స్ ను వాయిదా వేయాలని డెమొక్రటిక్ సభ్యుడు జిమ్ మెక్ గవర్న్ డిమాండ్ చేశారు. అరాచకాలకు పాల్పడని దేశంలో ఒలింపిక్స్ ను నిర్వహించాలని అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీకి సూచించారు.

More Telugu News