USA: పూర్తి టీకా వేసుకుంటే మాస్క్ అక్కర్లేదన్న అమెరికా నిర్ణయం అశాస్త్రీయం: ఐఎంఏ అధ్యక్షుడు

  • హెర్డ్ ఇమ్యూనిటీ ఇంకా రాలేదన్న ఐఎంఏ
  • 70% మందికి ప్రతిరక్షకాలుంటేనే సాధ్యం
  • డబుల్ మ్యుటెంట్ పై టీకా ప్రభావం 50 శాతమే
  • డాక్టర్ కె.కె. అగర్వాల్ రెండు డోసులూ తీసుకున్నా పోయారన్న ఐఎంఏ అధ్యక్షుడు
Indian Experts Warns Against US CDC Relaxed Norms Over Vaccination

కరోనా వ్యాక్సిన్ పూర్తిగా వేసుకున్న వారు (రెండు డోసులు లేదా జాన్సన్ అండ్ జాన్సన్ అయితే ఒక్క డోసే) మాస్క్ పెట్టుకోనవసరం లేదని ఇటీవలే అమెరికా వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం (సీడీసీ) ప్రకటించింది. ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్ కూడా ఆ ప్రకటన చేశారు. అయితే, అది అశాస్త్రీయమైన నిర్ణయమని భారత నిపుణులు తేల్చి చెబుతున్నారు.    

జనాభాలోని 70 శాతం మందిలో ప్రతిరక్షకాలు ఉత్పత్తి అయినప్పుడే సామూహిక రోగ నిరోధకశక్తి (హెర్డ్ ఇమ్యూనిటీ) వచ్చినట్టు భావించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) అధ్యక్షుడు డాక్టర్ జె.ఎ.జయలాల్ చెప్పారు. అమెరికాలో అప్పుడే హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చిందని చెప్పడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవన్నారు.

కరోనా వైరస్ పై టీకాల ప్రభావం 70 నుంచి 80 శాతం వరకే ఉందని, ఇప్పుడు పుట్టుకొచ్చిన డబుల్ మ్యుటెంట్ పై అయితే కేవలం 40 నుంచి 50 శాతమేనని అన్నారు. కాబట్టి కొత్త రకం కరోనాపై వ్యాక్సిన్ల ప్రభావం అంతంతేనని ఆయన వివరించారు. వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్నా డబుల్ మ్యుటెంట్ నుంచి రక్షణ ఉంటుందన్న గ్యారంటీ లేదన్నారు.

ఐఎంఏ మాజీ అధ్యక్షుడు డాక్టర్ కె.కె. అగర్వాల్ రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నా చనిపోయారని, దానికి కారణం వేరే జబ్బులుండడం, డబుల్ మ్యుటెంట్ తో మరింత సీరియస్ అయిందని చెప్పారు. కాబట్టి వ్యాక్సిన్ వేసుకున్న వాళ్లకూ కరోనా సోకే ముప్పుంటుందని, వారి నుంచి వేరే వాళ్లకూ వ్యాపించే అవకాశం ఉంటుందని తెలిపారు. మాస్క్ అవసరం లేదన్న అమెరికా మార్గదర్శకాలు నిర్లక్ష్యపూరితమేనన్నారు.

భారత్, అమెరికా మధ్య పోలికలు పెట్టడం సరికాదని ఢిల్లీలోని గంగారాం హాస్పిటల్ ఇమ్యునాలజీ అధిపతి డాక్టర్ చాంద్ వాటల్ చెప్పారు. అక్కడి జనాభా, జరిగిన వ్యాక్సినేషన్ ను దృష్టిలో పెట్టుకోవాలన్నారు. భారత్ లో ఇప్పటికీ చాలా కేసులున్నాయన్నారు. కాబట్టి అమెరికాలో ఇచ్చినట్టు మన దగ్గర సడలింపులు ఇవ్వడానికి లేదని తేల్చి చెప్పారు.

More Telugu News