PUBG: భారత్ లో మళ్లీ పబ్జీ... పేరు మార్చుకున్న గేమ్

  • ఏడాది కిందట పబ్జీపై కేంద్రం నిషేధం
  • భారత్ కోసం ప్రత్యేకంగా గేమ్ రూపొందించిన క్రాఫ్టన్
  • ఈ అర్ధరాత్రి నుంచి ప్రీ రిజిస్ట్రేషన్లు
  • 18 ఏళ్లకు పైబడినవారికే గేమ్
  • వచ్చే నెలలో కొత్త పబ్జీ లాంచ్
PUBG re enters india with a new version

యువతను విశేషంగా ఆకర్షించిన ఆన్ లైన్ గేమ్ పబ్జీని భారత్ గతేడాది నిషేధించింది. ఈ గేమ్ తో అనర్థాలు చోటుచేసుకుంటున్నాయని అనేక ఫిర్యాదులు రావడంతో పబ్జీపై కేంద్రం కొరడా ఝుళిపించింది. అయితే, పబ్జీ సొంతదారు క్రాఫ్టన్ ఇంక్ సంస్థ భారత్ కోసం బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా పేరిట కొత్త వెర్షన్ తీసుకువచ్చింది. ఈ నూతన పబ్జీకి ఈ అర్ధరాత్రి 12 గంటల నుంచి ప్రీ రిజిస్ట్రేషన్లు షురూ అవుతున్నాయి.

ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే ఈ ప్రీ రిజిస్ట్రేషన్లు వర్తిస్తాయని తెలుస్తోంది. గూగుల్ ప్లే స్టోర్ లో ప్రీ రిజిస్ట్రేషన్ లింక్ క్లిక్ చేయడం ద్వారా వివరాలు నమోదు చేసుకోవచ్చు. బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా గేమ్ ను జూన్ 10న భారత్ లో లాంచ్ చేయనున్నట్టు సమాచారం. దీనిపై క్రాఫ్టన్ సంస్థ స్పందిస్తూ, భారత కేంద్ర ప్రభుత్వ నియమ నిబంధనలకు కట్టుబడి వ్యవహరిస్తామని, ప్రీ రిజిస్ట్రేషన్ సమాచారం ఎంతో భద్రంగా ఉంటుందని స్పష్టం చేసింది.

కాగా, 18 ఏళ్లకు పైబడిన వారే ఈ గేమ్ ఆడేందుకు అర్హులని క్రాఫ్టన్ పేర్కొంది. ఈ నూతన గేమ్ ఆడాలనుకునేవారు తమ తల్లిదండ్రుల ఫోన్ నెంబరు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. భారత్ లో ఉంటున్న వారికే ఈ గేమ్ అని క్రాఫ్టన్ స్పష్టం చేసింది.

More Telugu News