Bhopal: కరోనా పేషెంట్ ను రేప్ చేసిన మేల్ నర్స్.. అదే రోజు బాధితురాలి మృతి!

  • భోపాల్ లోని ప్రభుత్వాసుపత్రిలో దారుణం
  • 43 ఏళ్ల కరోనా పేషెంట్ పై 40 ఏళ్ల మేల్ నర్స్ అత్యాచారం
  • ఆమె వివరాలను వెల్లడించని డాక్టర్లు, పోలీసులు
Male nurse reaped corona patient in Bhopal

మేల్ నర్స్ రేప్ చేసిన కరోనా పేషెంట్ అదే రోజు మృతి చెందిన ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, భోపాల్ లోని భోపాల్ మెమోరియల్ ఆసుపత్రి (గవర్నమెంట్ హాస్పిటల్)లో 43 ఏళ్ల మహిళ కరోనాకు చికిత్స పొందుతోంది. ఆమెపై 40 ఏళ్ల సంతోష్ అహిర్వార్ అనే మేల్ నర్స్ అత్యాచారానికి పాల్పడ్డాడు. తనను రేప్ చేసినట్టు ఆమె ఏప్రిల్ 6న డాక్టర్లకు తెలిపింది. అత్యాచారానికి గురైన తర్వాత ఆమె మానసికంగా కుంగిపోవడంతో వెనువెంటనే ఆమె ఆరోగ్యం క్షీణించడం మొదలైంది. దీంతో, అదే రోజు సాయంత్రం ఆమె మృతి చెందింది.

డాక్టర్ల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సంతోష్ ను అరెస్ట్ చేసి రిమాండుకు పంపించారు. ఈ సందర్భంగా ఒక సీనియర్ పోలీసు అధికారి మాట్లాడుతూ, తన వివరాలను బయటపెట్టొద్దంటూ సదరు మహిళ కోరిందని... అందుకే ఆమె వివరాలను వెల్లడించడం లేదని తెలిపారు. కేవలం దర్యాప్తు చేస్తున్న టీమ్ కు మాత్రమే వివరాలను ఇచ్చామని అన్నారు. 1984లో జరిగిన భోపాల్ గ్యాస్ దుర్ఘటన నుంచి సదరు మహిళ ప్రాణాలతో బయటపడటం గమనార్హం.

మరోవైపు హాస్పిటల్ మేనేజ్ మెంట్ దీనిపై స్పందిస్తూ, ఈ దారుణ ఘటనను తాము సీరియస్ గా తీసుకున్నామని తెలిపింది. అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకున్నామని చెప్పింది. మృతురాలి కుటుంబసభ్యులకు కూడా రేప్ గురించి చెప్పలేదని వెల్లడించింది. భోపాల్ గ్యాస్ బాధితులు కరోనా వల్ల చనిపోయే అవకాశాలు ఏడు రెట్లు ఎక్కువగా ఉంటాయని తెలిపింది.

More Telugu News