Black Fungus: యూపీపై బ్లాక్ ఫంగస్ పంజా.. లక్షణాలు ఇవిగో!

  • యూపీలో 73 బ్లాక్ ఫంగస్ కేసుల నమోదు
  • ఫంగస్ కారణంగా కంటిచూపును కోల్పోతున్న పేషెంట్లు
  • సుదీర్ఘకాలంగా స్టెరాయిడ్స్ వాడుతున్న వారిపై తీవ్ర ప్రభావం
UP registers 73 Black Fungus cases

ఓవైపు కరోనా మహమ్మారి పంజా విసురుతుంటే, మరోవైపు బ్లాక్ ఫంగస్ క్రమంగా విస్తరిస్తోంది. వేగంగా అన్ని రాష్ట్రాలకు వ్యాపిస్తోంది. తెలంగాణలో ఇప్పటికే ఒక వ్యక్తి బ్లాక్ ఫంగస్ కారణంగా మృతి చెందడం కలకలం రేపుతోంది. మరోవైపు, ఉత్తరప్రదేశ్ ను బ్లాక్ ఫంగస్ ఉలిక్కిపడేలా చేస్తోంది.

యూపీలో ఏకంగా ఇప్పటివరకు 73 కేసులు బయటపడ్డాయి. వీటిలో అత్యధికంగా వారణాసిలో 20 కేసులు నమోదయ్యాయి. లక్నోలో 15, గోరఖ్ పూర్ లో 10, ప్రయాగ్ రాజ్ లో 6, గౌతమ్ బుద్ధ్ నగర్ లో 5, మీరట్ లో 4, కాన్పూర్, మధురలో రెండు చొప్పున, ఆగ్రాలో ఒక్క కేసు నిర్ధారణ అయ్యాయి.

బ్లాక్ ఫంగస్ కారణంగా కాన్పూర్ లో ఇద్దరు కరోనా పేషెంట్లు మృతి చెందగా... మధురలో ఇద్దరు, లక్నోలో ఒక పేషెంట్ ఫంగస్ ఇన్ఫెక్షన్ కారణంగా కంటిచూపును కోల్పోయారు. భయంకరమైన ఈ ఫంగస్ విస్తరిస్తున్న నేపథ్యంలో యూపీలోని యోగి ప్రభుత్వం అలర్ట్ అయింది. ఫంగస్ వ్యాప్తి చెందుతున్న తొలి దశలోనే దాన్ని ఎదుర్కొనేందుకు 14 మంది వైద్య నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని సీఎం యోగి ఆదేశించారు. ఈ కమిటీ ప్రస్తుత పరిస్థితిని సమీక్షించడమే కాకుండా... ప్రభుత్వానికి అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తుంది.

బ్లాక్ ఫంగస్ లక్షణాలు ఇవే: కళ్లు, ముక్కు చుట్టూ ఎర్రబారడం, జ్వరం, తలనొప్పి, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, నొప్పులు, నెత్తుటి వాంతులు, చురుకుదనంలో మార్పులు చోటుచేసుకోవడం.

సుదీర్ఘకాలంగా స్టెరాయిడ్స్ వాడుతున్న వారు, ఇమ్యూనిటీ చాలా తక్కువగా ఉన్నవారు బ్లాక్ ఫంగస్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. డయాబెటిస్ నియంత్రించలేని స్థాయిలో ఉన్నవారికి కూడా ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెపుతున్నారు.

More Telugu News