East Godavari District: పెద్దాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం.. గృహప్రవేశానికి వెళ్తూ నలుగురి మృత్యువాత

  • పెద్దవలస నుంచి రాజమహేంద్రవరానికి కారులో కుటుంబం
  • డ్రైవర్ నిద్రమత్తుతో లారీని  ఢీకొట్టిన వైనం
  • మృతుల్లో ఐదు నెలల చిన్నారి
4 dead in an Accident in Peddapuram east godavari

తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ శుభకార్యానికి కారులో బయలుదేరిన కుటుంబ సభ్యుల్లో నలుగురు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. తాళ్లరేవు మండలం పెద్దవలసకు చెందిన ఓ కుటుంబం గృహ ప్రవేశ వేడుక కోసం కారులో రాజమహేంద్రవరం బయలుదేరింది.

ఈ క్రమంలో  పెద్దాపురం ఏడీబీ రోడ్డుపై ఉన్న రుచి సోయా పరిశ్రమ వద్ద ఎదురుగా వస్తున్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న 9 మందిలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వీరిలో ఐదు నెలల చిన్నారి కూడా ఉంది. కారు డ్రైవర్ నిద్రమత్తే ఇందుకు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News