Corona Virus: కరోనా టీకాలు గర్భిణులూ వేయించుకోవచ్చు.. ముప్పేమీ ఉండదు: నిపుణులు

  • మాయ అనేది విమానాల్లో బ్లాక్‌బాక్స్ లాంటిది
  • టీకా వేసుకున్నాక కూడా మాయ తన పని తాను చేస్తోంది
  • గర్భస్థ శిశువుకు కరోనా సోకకుండా ఉండేదుకు గర్భిణికి టీకా వేయడమే మార్గం
vaccines are safe in pregnancy does not damage placenta

కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు ఇస్తున్న టీకాలు గర్భిణులకు కూడా సురక్షితమేనని నిపుణులు చెబుతున్నారు. టీకాల వల్ల గర్భంలోని మాయకు హాని కలుగుతుందని చెప్పడానికి ఆధారాలు లభించలేదని ‘ఆబ్‌స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ’ జర్నల్‌ తాజా సంచికలో ప్రచురితమైన అధ్యయనం పేర్కొంది.

నిజానికి మాయ అనేది విమానాల్లో బ్లాక్‌బాక్స్ లాంటిదని నిపుణులు చెబుతున్నారు. మాయలో సంభవించే మార్పులు గర్భంలో తలెత్తే సమస్యలను తెలుసుకోవడానికి ఉపయోగపడతాయన్నారు. ఈ మేరకు అమెరికాలోని నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీకి చెందిన ఫీన్‌బర్గ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జెఫరీ గోల్డ్‌స్టీన్ తెలిపారు.

కరోనా టీకాలు వేయించుకున్న 84 మందిని, వేయించుకోని 116 మంది గర్భిణులను పరిశీలించిన అనంతరం ఈ నిర్ధారణకు వచ్చినట్టు వివరించారు. టీకాల వల్ల మాయకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని తేలిందన్నారు. అయితే, ఇది ప్రాథమిక నిర్థారణ మాత్రమేనని, మరింత మందిని అధ్యయనం చేయడం ద్వారా అంతిమంగా ఓ నిర్ణయానికి రావొచ్చన్నారు.

గర్భస్థ శిశువుకు కరోనా సంక్రమించకుండా ఉండేందుకు ప్రస్తుతం ఉన్న ఏకైక మార్గం తల్లికి టీకా వేయడమేనని, ఆమె ద్వారా యాంటీబాడీలు శిశువుకు కూడా చేరుతాయని ఆయన పేర్కొన్నారు. హార్మోనుల తయారీ మొదలు వ్యాధుల రక్షణకు వ్యవస్థలు ఏర్పడడానికి కూడా మాయే ఆధారమని పేర్కొన్నారు. టీకా వేసుకున్నతర్వాత కూడా మాయ యథావిధిగా తన పని తాను చేస్తోందని తమ పరిశోధనలో తేలిందని గోల్డ్‌స్టీన్ వివరించారు.

More Telugu News