Amitabh Bachchan: నా సాయం రూ. 2 కోట్లు కాదు.. రూ. 15 కోట్లు: విమర్శకులకు బదులిచ్చిన అమితాబ్

  • అమితాబ్ రూ. 2 కోట్లు మాత్రమే ఇచ్చారంటూ విమర్శలు
  • తానేం చేసిందీ వివరించిన బిగ్‌బీ
  • తనకు కష్టమైనా ఆనందంగా చేశానన్న అమితాబ్
Amitabh Bachchan responds on covid relief fund donation criticize

కరోనా సెకండ్ వేవ్‌తో దేశం కల్లోలంగా మారితే సినీ నటులు ఎవరూ బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావడం లేదంటూ ఇటీవల విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విమర్శలపై తాజాగా బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ స్పందించారు. ఢిల్లీలోని కొవిడ్ సెంటర్‌కు తాను 2 కోట్ల రూపాయలు ఇచ్చినట్టు చర్చ జరిగిందన్న అమితాబ్.. చేసిన సాయాన్ని చెప్పుకోవడం తనకు ఇబ్బందిగా ఉంటుందన్నారు. అయినా విమర్శల నేపథ్యంలో చెప్పక తప్పడం లేదన్నారు. కరోనా బాధితుల సహాయార్థం తాను ఇప్పటి వరకు చేసిన సాయం మొత్తం విలువ రూ. 15 కోట్ల వరకు ఉంటుందన్నారు.

ఇప్పటి వరకు తానేం చేసినదీ కూడా అమితాబ్ చెప్పుకొచ్చారు. ముంబై జుహూలో 25-50 పడకల కొవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటుకు నిధులు ఇచ్చానని, ఫ్రంట్ లైన్ వర్కర్లకు పీపీఈ కిట్లు, మాస్కులు అందజేశానని వివరించారు. ముంబై ఆసుపత్రికి ఎంఆర్ఐ యంత్రం, సోనో గ్రాఫిక్, స్కానింగ్ పరికరాలను సమకూర్చినట్టు చెప్పారు. ఎంతోమంది పేద రైతులను ఆదుకున్నానని, ఇంత పెద్ద సాయం తనకు కష్టమైనా సరే ఆనందంగా చేశానని అమితాబ్ వివరించారు. అలాగే, 20 వెంటిలేటర్ల కోసం విదేశీ కంపెనీలకు ఆర్డర్ ఇచ్చానని, వాటిలో ఇప్పటికే పది అందుబాటులోకి వచ్చాయని అమితాబ్ పేర్కొన్నారు.

More Telugu News