Manoj Tiwary: బెంగాల్ క్రీడాశాఖ మంత్రిగా టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ

  • భారత్ తరపున 12 వన్డేలు, 3 టీ20 ఆడిన తివారీ
  • ఇటీవలి ఎన్నికల్లో శివ్‌పూర్ నియోజకవర్గం నుంచి గెలుపు
  • కొత్త ప్రయాణం మొదలైందంటూ ట్వీట్
Team India Ex Cricketer Manoj Tiwary got berth in Mamata Cabinet

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో శివ్‌పూర్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన టీమిండియా మాజీ క్రికెటర్‌ మనోజ్ తివారీకి మమత మంత్రివర్గంలో చోటు లభించింది. సోమవారం ఆయన రాష్ట్ర యువజన, క్రీడాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ‘కొత్త ప్రయాణం మొదలైంది’ అంటూ ట్వీట్ చేశారు. ప్రమాణ స్వీకారం తనకు కొత్త అనుభూతన్నారు. తనపై నమ్మకంతో ప్రజలకు సేవచేసే అవకాశం కల్పించిన దీదీ మమత, తన సోదరుడు అభిషేక్‌లకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నారు.

కాగా, భారత్ తరపున తివారీ 12 వన్డేలు, 3 టీ20లు ఆడాడు. అలాగే, 16 ఏళ్లపాటు ఫస్ట్‌ క్లాస్ క్రికెట్‌లో కొనసాగాడు. 50.36 సగటుతో 8965 పరుగులు చేశాడు. 2012లో ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టులో తివారీ సభ్యుడు.

More Telugu News