Corona Virus: కొవిడ్‌ సంరక్షణా కేంద్రానికి అమితాబ్‌ రూ.2 కోట్ల విరాళం

  • ఢిల్లీలోని రాకబ్‌ గంజ్‌లో కరోనా కేంద్రం ఏర్పాటు
  • గురుద్వారా మేనేజ్‌మెంట్‌ కమిటీ ఆధ్వర్యంలో పనులు
  • ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్ల ఏర్పాటుకూ కృషి చేస్తానన్న బిగ్‌బీ
  • వెల్లడించిన గురుద్వారా మేనేజ్‌మెంట్‌ కమిటీ అధ్యక్షుడు
rs 2 crs to covid care centre

దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తున్న వేళ ఎంతో మంది సినీ తారలు, క్రీడా ప్రముఖులు తమ వంతు సాయంగా విరాళాలు ప్రకటిస్తున్నారు. తాజాగా బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అమితాబ్ బచ్చన్‌ కొవిడ్‌ బాధితులకు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చారు. ఢిల్లీలోని రాకబ్ గంజ్‌ ప్రాంతంలోని గురుద్వారా ఆధ్వర్యంలో ఏర్పాటవుతున్న కరోనా సంరక్షణా కేంద్రానికి రూ.2 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఈ విషయాన్ని ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్‌ కమిటీ అధ్యక్షుడు మజిందర్ సింగ్‌ వెల్లడించారు.

సిక్కులు చాలా గొప్పవారని.. వారి సేవాస్ఫూర్తికి వందనాలని అమితాబ్‌ ఈ సందర్భంగా వ్యాఖ్యానించినట్లు మజిందర్‌ సింగ్‌ తెలిపారు. ఢిల్లీలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉన్న సమయంలో ప్రతిరోజూ అమితాబ్‌ తనకు ఫోన్‌ చేసి పరిస్థితులపై ఆరా తీసేవారని తెలిపారు. అలాగే కొవిడ్‌ కేంద్ర నిర్మాణ పనులను గురించి అడిగి తెలుసుకునేవారన్నారు. అలాగే రానున్న రోజుల్లో ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తానని మాటిచ్చారన్నారు. రాకబ్ గంజ్‌లో ఏర్పాటు చేసిన కొత్త కొవిడ్‌ సంరక్షణా కేంద్రం సోమవారం ప్రారంభం కానుంది. మొత్తం 300 పడకల్ని ఇందులో ఏర్పాటు చేశారు.

More Telugu News