Afghanistan: ఆఫ్ఘాన్‌లో చెలరేగిన ముష్కరులు.. పాఠశాల వద్ద జరిగిన బాంబు దాడిలో 30 మంది దుర్మరణం

  • మృతుల్లో అత్యధికులు 15 ఏళ్లలోపు విద్యార్థులే
  • పేలుడు ఘటనను తీవ్రంగా ఖండించిన తాలిబన్లు
  • బాధితులతో నిండిపోయిన ఆసుపత్రులు
30 dead most of them students in kabul bomb attack

ఆప్ఘనిస్థాన్‌లో ఉగ్రవాదులు మరోమారు చెలరేగిపోయారు. రాజధాని కాబూల్‌లోని ఓ పాఠశాల వద్ద నిన్న జరిగిన శక్తిమంతమైన బాంబు పేలుడులో 30 మంది దుర్మరణం పాలయ్యారు. వీరిలో అత్యధికులు విద్యార్థులేనని, అది కూడా 11-15 ఏళ్ల మధ్య వయసున్న వారేనని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఈ దారుణంపై తాలిబన్లు స్పందించారు. ఈ పేలుడుతో తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. పశ్చిమ కాబూల్‌లోని దష్ట్-ఎ-బార్చి జిల్లాలోని సయ్యద్ అల్ షాదా పాఠశాల వద్ద ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బందిపై స్థానికులు దాడికి పాల్పడ్డారు. సిబ్బందిపైనా దాడి చేశారు. క్షతగాత్రులు, మృతదేహాలతో సమీపంలోని ఆసుపత్రులు నిండిపోయాయి. కాగా, బాంబు పేలుడుకు ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత ప్రకటించలేదు.

More Telugu News