London: భారత్​ ను ఆదుకునేందుకు వినూత్న కార్యక్రమం చేపట్టిన లండన్​ లోని హిందూ దేవాలయం!

  • ‘లండన్ టు ఢిల్లీ బైకథాన్’
  • శ్రీకారం చుట్టిన స్వామి నారాయణ మందిర్ 
  • ఉన్నచోటే ఉండి 7,600 కిలోమీటర్ల సైక్లింగ్ 
  • రూ.5.12 కోట్ల సమీకరణ లక్ష్యం
  • భారీగా ముందుకొస్తున్న ప్రవాసీయులు
  • వారికి తోడుగా బ్రిటన్ వాసుల రైడ్
  • జతకడుతున్న మరిన్ని ఆలయాలు
London to Delhi bikeathon raises cash for Indias Covid crisis

కరోనాతో ఊపిరి కూడా పీల్చుకోలేకపోతున్న భారత్ ను ఆదుకునేందుకు ఇప్పటికి ప్రపంచ దేశాలు ముందుకొచ్చాయి. వాటికి తోచిన సాయం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే విదేశాల్లోని ప్రవాస భారతీయులూ తమ వంతు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. బ్రిటన్  రాజధాని లండన్ లో ఉన్న అతిపెద్ద హిందూ దేవాలయమైన శ్రీ స్వామినారాయణ మందిర్.. భారత్ ను ఆదుకునేందుకు ఓ మంచి కార్యక్రమాన్ని చేపట్టింది.


భారత్ కు ఆర్థిక సాయం అందించే లక్ష్యంతో 5 లక్షల పౌండ్ల (సుమారు రూ.5.12 కోట్లు) సమీకరణే ధ్యేయంగా  లండన్ నుంచి ఢిల్లీ వరకు బైకథాన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నియాస్డెన్ లో ఉన్న ఆ దేవాలయ ప్రాంగణంలో ‘సైకిల్ టు సేవ్ ద లైవ్స్’ పేరిట ఈ బైకథాన్  రైడ్ ను ప్రారంభించింది. బైకథాన్ అన్నారు కదా అని వారు లండన్ నుంచి ఢిల్లీ దాకా ప్రయాణమేమీ చేయరు. దేవాలయాల పరిసరాల్లో ఏర్పాటు చేసిన స్టాటిక్ (స్థిరంగా ఉండేవి) సైకిళ్లను తొక్కుతారు. రెండు రోజుల ఈ కార్యక్రమంలో ఉన్నచోటే ఉండి దాదాపు 7,600 కిలోమీటర్లు సైకిల్ తొక్కనున్నారు.


భారతీయులతో పాటు అక్కడి దేశస్థులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా 12 స్టాటిక్ సైకిళ్లను గుడి ముందు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పాల్గొనాలనుకునే ఒక్కో వాలంటీర్ 50 నిమిషాల పాటు సైకిల్ ను తొక్కొచ్చు. తన రైడ్ పూర్తయ్యాక ఆ సైకిల్ ను అప్పగించేముందు దానిని 10 నిమిషాల పాటు సదరు రైడరే శానిటైజ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా 750 మంది స్వచ్ఛందంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామి నారాయణ ఆలయ కార్యక్రమం నచ్చి మరికొన్ని దేవాలయాలు ఇలాంటి కార్యక్రమాలను చేపడుతున్నాయి.

More Telugu News