Eatala Rajender: ప్రతి ఒక్కరికీ శిరసు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నా: ఈటల

  • ఈటలపై తీవ్ర ఆరోపణలు
  • 100 ఎకరాలు కబ్జా చేశారంటున్న రైతులు
  • విచారణకు ఆదేశించిన సీఎం కేసీఆర్
  • ఆరోగ్యమంత్రిగా ఈటలను తప్పించిన వైనం
  • పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపిన ఈటల
Eatala thanked everyone who helped him during his tenure

దాదాపు 100 ఎకరాల అసైన్డ్ భూములను ఆక్రమించాడంటూ ఈటల రాజేందర్ పై ఫిర్యాదు అందడం, సీఎం కేసీఆర్ వెంటనే విచారణకు ఆదేశించడం తెలిసిందే. తాజాగా ఈటలను ఆరోగ్యమంత్రిగానూ తప్పించారు. ఈ నేపథ్యంలో, ఈటల ట్విట్టర్ లో స్పందించారు. గత రెండేళ్లుగా, ముఖ్యంగా గత 395 రోజులుగా ఒక్కరోజు కూడా విరామం లేకుండా పనిచేస్తూ, వైద్య ఆరోగ్యమంత్రిగా నాకు సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు అని వెల్లడించారు.

కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి, కుటుంబాలకు దూరంగా ఉంటూ కరోనా చికిత్స అందించిన వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, డాక్టర్లు, నర్సులు, సెక్యూరిటీ, శానిటరీ, నాలుగవ తరగతి సిబ్బంది, గ్రామాల్లో ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు అందరికీ శిరసు వంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అంటూ ఈటల ట్వీట్ చేశారు.

మెదక్ జిల్లా మాసాయి పేట మండలం అచ్చంపేట గ్రామ పరిధిలో హేచరీస్ నిర్మాణం కోసం రైతుల నుంచి బలవంతంగా అసైన్డ్ భూములను రాయించుకున్నారంటూ ఈటలపై ఆరోపణలు వచ్చాయి. దీనిపై ప్రస్తుతం విచారణ కూడా జరుగుతోంది.

More Telugu News