Mahesh Babu: త్రివిక్రమ్ తో మహేశ్ మూవీ ఖరారు!

  • త్రివిక్రమ్ తో మహేశ్ మూడో మూవీ
  • 11 ఏళ్ల తరువాత కలిసి సెట్స్ పైకి
  • నిర్మాణ సంస్థగా హారిక అండ్ హాసిని క్రియేషన్స్

Mahesh Babu upcoming movie with Trivikram is confirmed

మహేశ్ బాబు - త్రివిక్రమ్ కాంబినేషన్లో ఒక సినిమా రూపొందనున్నట్టుగా కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇటీవలే హఠాత్తుగా ఈ కాంబినేషన్ తెరపైకి రావడంతో, ఈ ప్రాజెక్టుకు సంబంధించి వచ్చిన వార్తలపై చాలామందికి సందేహాలు ఉన్నాయి. అయితే అలాంటి అనుమానాలకు తెరదించుతూ, దర్శక నిర్మాతలు తాజాగా ఒక ప్రకటనను వదిలారు. గతంలో మహేశ్ బాబు హీరోగా త్రివిక్రమ్ 'అతడు' సినిమాను తెరకెక్కించాడు. అప్పట్లో ఆ సినిమా అంతగా ఆడకపోయినా, ఇప్పటికీ బుల్లితెరపై తన సత్తా చాటుతూనే ఉంటుంది. ఇక ఆ తరువాత ఈ కాంబినేషన్లో వచ్చిన 'ఖలేజా' కూడా ఆశించినస్థాయిలో ఆడలేదు.

ఇక త్రివిక్రమ్ - మహేశ్ బాబు కాంబినేషన్లోని మూడో సినిమాకి రంగం సిద్ధమైంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మితం కానుంది. సంఖ్యా పరంగా మహేశ్ బాబుకు ఇది 28వ సినిమా. త్వరలోనే ఈ సినిమా షూటింగు మొదలవుతుందనీ, వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను విడుదల చేయనున్నామనే విషయాన్ని అధికారికంగా తెలియజేశారు. 11 ఏళ్ల తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందనున్న ఈ సినిమాపై అందరిలోను ఆసక్తి ఉంది. కథానాయికగా పూజా హెగ్డే పేరు వినిపిస్తున్నప్పటికీ, అధికారికంగా తెలియాల్సి ఉంది.

More Telugu News