Corona Virus: దేశంలో అనూహ్య పరిస్థితులు.. ఇప్పటి వరకు 40 దేశాల నుంచి సాయం: విదేశాంగ శాఖ

Fourty Countries have responded to help india in Fight against Corona
  • దేశంలో కరోనా కల్లోలం
  • ఇతర దేశాల నుంచి సాయం కోరిన భారత్‌
  • మిత్రధర్మం పాటిస్తూ స్పందిస్తున్న దేశాలు
  • రానున్న రోజుల్లో అమెరికా నుంచి ప్రత్యేక విమానాలు
  • ఫ్రాన్స్‌, ఐర్లాండ్‌, మారిషస్‌, బంగ్లాదేశ్‌, భూటాన్‌ నుంచీ సాయం
కరోనా ఉద్ధృతి నేపథ్యంలో దేశవ్యాప్తంగా వైద్య పరికాలు, ఆక్సిజన్‌,  ఔషధాలు, వ్యాక్సిన్ల కొరత తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దీంతో అప్రమత్తమైన కేంద్రం అన్ని దేశాల నుంచి సాయాన్ని ఆహ్వానించింది.

దేశంలో అనూహ్య పరిస్థితులు నెలకొని ఉన్నాయన్న విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా.. కరోనా రెండో దశపై భారత్ చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఇప్పటి వరకు 40 దేశాలు తమ సాయాన్ని ప్రకటించాయని తెలిపారు. ఆయా దేశాలు కష్ట సమయాల్లో ఉన్న తరుణంలో భారత్‌ వారిని ఆదుకుందని.. మిత్రధర్మం పాటిస్తూ ఇప్పుడు వారంతా భారత్‌కు అండగా నిలుస్తున్నారని అభిప్రాయపడ్డారు.

రేపటితో మొదలుకొని రానున్న రోజుల్లో అమెరికా నుంచి కీలక వైద్య సరఫరాలతో ప్రత్యేక విమానాలు భారత్‌కు చేరుకోనున్నాయని శ్రింగ్లా తెలిపారు. అలాగే గురువారం రాత్రి యూఏఈ నుంచి వెంటిలేటర్లు, ఫావిపిరావిర్‌ సహా మరికొన్ని వైద్య సామగ్రితో కార్గో విమానం భారత్‌కు రానుందని చెప్పారు. ఫ్రాన్స్‌, ఐర్లాండ్‌, మారిషస్‌, బంగ్లాదేశ్‌, భూటాన్‌ నుంచి కూడా సాయం అందనుందని తెలిపారు. ఆక్సిజన్‌ కొరత నేపథ్యంలో ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు, జనరేటర్లు, క్రయోజనిక్ ట్యాంకర్లు, ప్రాణవాయువు సరఫరాకు కావాల్సిన ఇతర సామగ్రికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు.
Corona Virus
America
Oxygen
Medical Supplies

More Telugu News