ka paul: ఏపీకి ఆక్సిజన్, వాక్సిన్లు పంపాల‌ని విదేశీ నేతలను కోరాను: కేఏ పాల్

  • ఏపీలో ప‌దో త‌ర‌గ‌తి, ఇంటర్ పరీక్షలు నిర్వ‌హించ‌కూడ‌దు
  • కరోనా సోకితే విద్యార్థుల ప్రాణాలకు ఎవరిది బాధ్యత?
  •  దేశంలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి
  • ఏపీకి ఆక్సిజన్, వాక్సిన్లు పంపించాలని పొరుగు రాష్ట్రాల సీఎంల‌నూ కోరాను
ka paul slam jagan

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా ఉద్ధృతి రోజురోజుకీ భారీగా పెరిగిపోతున్న‌ప్ప‌టికీ ప‌దో త‌ర‌గ‌తి, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామ‌ని ప్ర‌భుత్వం చెప్ప‌డం ప‌ట్ల కేఏ పాల్ మండిప‌డ్డారు. కరోనా సోకితే విద్యార్థుల ప్రాణాలకు ఎవరు బాధ్యత వహిస్తారని ఆయ‌న నిల‌దీశారు.

క‌రోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో ఇత‌ర రాష్ట్రాలు ఇప్ప‌టికే పరీక్షలు వాయిదా వేశాయని చెప్పారు. ఏపీలో పరీక్షలు వాయిదా వేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు వివ‌రించారు. సీఎం జ‌గ‌న్, ఏపీ మంత్రుల పిల్లలవే ప్రాణాలా? అని ఆయ‌న నిల‌దీశారు. సునామీ కన్నా ప్రమాదకరంగా క‌రోనా మారిందని చెప్పారు.

పరీక్షలపై ఏపీ హైకోర్టు నిర్ణయం తీసుకోవాల‌ని, లేదంటే విద్యార్థులు కరోనాకు బలైపోయే అవకాశం ఉందని ఆయ‌న ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. జగన్ విద్యార్థుల భవిష్యత్, ప్రాణాల గురించి ఆలోచించాలని  ఆయ‌న అన్నారు. దేశంలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని తెలిపారు.

ఏపీకి ఆక్సిజన్, వాక్సిన్లు, కిట్లు పంపించాలని తాను పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు విదేశీ నేతలను కోరాన‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా చాపకింద నీరులా విస్తరిస్తోందని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. విశాఖలో ఏడాది పాప కరోనాతో ఆసుప‌త్రికి వెళ్లి అక్క‌డే మృతి చెంద‌డం బాధాకరమని తెలిపారు.  

క‌రోనా స‌మ‌యంలో జ‌రిగిన కుంభమేళా, ఎన్నికలు, బహిరంగ సభలు, సమావేశాలు క‌రోనా విజృంభ‌ణ‌కు కార‌ణాలని, రాజ‌కీయ నేత‌ల తీరు బాగోలేద‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మ‌రోవైపు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ‌పై హైకోర్టులో పిటిషన్ వేశానని, స్టీల్ ప్లాంట్ ను అమ్మకుండా అడ్డుకుంటామని చెప్పారు.



  • Loading...

More Telugu News