Sri Lanka: బహిరంగ ప్రదేశాల్లో బురఖా ధరించడాన్ని నిషేధించిన శ్రీలంక

  • 2019లో తావీద్ జమాత్ ఆత్మాహుతి దాడి
  • 11 మంది భారతీయులు సహా 270 మంది మృతి
  • బురఖాలు ధరించి పేలుళ్లకు పాల్పడిన ఉగ్రవాదులు
  • కేబినెట్ తీర్మానాన్ని పార్లమెంటు ఆమోదించిన వెంటనే చట్టంగా మార్పు
Sri Lanka announces burqa ban

జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకుని శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో బురఖా ధరించడాన్ని నిషేధిస్తూ నిన్న శ్రీలంక మంత్రిమండలి తీర్మానించింది. 2019లో ఈస్టర్ రోజున నేషనల్ తావీద్ జమాత్ ఆత్మాహుతి దళానికి చెందిన 9 మంది ఉగ్రవాదులు బురఖా ధరించి చర్చ్‌లు, హోటళ్లపై పేలుళ్లకు తెగబడ్డారు. ఈ వరస దాడుల్లో దేశవ్యాప్తంగా 270 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 11 మంది భారతీయులు కూడా ఉన్నారు. అలాగే, 500 మందికిపైగా గాయపడ్డారు.

ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో ముఖాన్ని పూర్తిగా కప్పి ఉంచే ముసుగులు ధరించరాదని తీసుకున్న నిర్ణయాన్ని నిన్న మంత్రి మండలి ఆమోదించింది. కేబినెట్ నిర్ణయాన్ని పార్లమెంటు ఆమోదించిన వెంటనే చట్టంగా మారుతుంది. అయితే, కరోనా నేపథ్యంలో మాస్కులు ధరించడంపై మాత్రం ఎలాంటి ఆంక్షలు లేవని ప్రభుత్వం స్పష్టం చేసింది.

More Telugu News