west bengal: కొవిడ్‌ విజృంభణకు కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం: మమతా బెనర్జీ

  • బీజేపీ ప్రభుత్వం తప్పుడు నిర్ణయాల వల్లే కరోనా ఉద్ధృతి
  • కొవిడ్‌ కట్టడికి ప్రభుత్వం వద్ద ఎలాంటి ప్రణాళిక లేదు
  • బెంగాల్‌ను ఆక్రమించుకోవడమే బీజేపీ  లక్ష్యం
  • ఈసీ, కేంద్ర బలగాలు బీజేపీకి అనుకూలం
  • ఎన్నికల ప్రచారంలో మమతా బెనర్జీ ఆరోపణలు
Covid surge is the result of centres Negligence Mamata Banerjee alleges

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ.. బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కొవిడ్‌ విజృంభణను కట్టడి చేయడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. కొవిడ్‌ నివారణకు కేంద్రం వద్ద ఎలాంటి ప్రణాళిక లేదని విమర్శించారు. బీజేపీ ఏకైక లక్ష్యం ‘బెంగాల్‌ను ఆక్రమించుకోవడమే’ అని మండిపడ్డారు. కోల్‌కతాలోని శ్యామ్‌పోకూర్‌ ప్రజలనుద్దేశించి వర్చువల్‌గా ప్రసంగించిన ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

కేంద్ర ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలు, నిర్లక్ష్యం, అజ్ఞానం వల్లే దేశం కొవిడ్‌ కష్టాలు ఎదర్కొంటోందని మమత ఆరోపించారు. అధికారం కోసం ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షా బెంగాల్‌లోనే పాగా వేశారని విమర్శించారు. కొవిడ్‌ను కట్టడి చేయడం కంటే బెంగాల్‌ను ఎలా ‘నాశనం’ చేయాలనే దానిపైనే దృష్టి సారించారని తెలిపారు.

ఎన్నికల సంఘం, కేంద్ర భద్రతా బలగాలు బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నాయంటూ దీదీ తీవ్ర ఆరోపణలు చేశారు.  ఎన్నికల సంఘం తన బాధ్యతల్ని విస్మరించిందంటూ మద్రాస్ హైకోర్టు చేసిన వ్యాఖ్యల్ని మమత సమర్థించారు. బెంగాల్‌లో పోలింగ్‌ విడతల సంఖ్యను కుదించాలని కోరినప్పటికీ.. ఎన్నికల సంఘం మాత్రం బీజేపీ అనుకూల వైఖరినే ప్రదర్శించిందని ఆరోపించారు. ఎన్నికల సంఘం బయటి నుంచి రెండు లక్షల బలగాల్ని ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిందని.. వారే బెంగాల్‌లో కరోనాను వ్యాప్తి చేస్తున్నారన్నారు.

More Telugu News