COVID19: 18 ఏళ్లు నిండిన వారికి కరోనా టీకా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.67,193 కోట్ల ఖర్చు!

  • ఇండియా రేటింగ్స్ అధ్యయనంలో వెల్లడి
  • జీడీపీలో దాని విలువ 0.36 శాతమేనని కామెంట్
  • ఒక్క కేంద్రానికే 20,870 కోట్ల వ్యయం
  • అన్ని రాష్ట్రాలకూ కలిపి రూ.46,323 కోట్లు
  • మే 1 నుంచి మొదలుకానున్న మూడో దశ వ్యాక్సినేషన్
India Needs Rs 67193 Cr for Vaccination Over 18 Years of Age

మే 1 నుంచి 18 ఏళ్లు దాటిన వారందరికీ కరోనా టీకాలు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. వ్యాక్సిన్ల కొనుగోలు అధికారాన్ని ఇప్పటికే రాష్ట్రాలకు ఇచ్చేసింది. ఈ నెల 28 నుంచి రిజిస్ట్రేషన్లనూ మొదలుపెట్టబోతోంది. అయితే, దేశంలో దాదాపు 84.2 కోట్ల మందికిపైగా 18 ఏళ్లపైబడినవారుంటారని అంచనా.

మరి వారందరికీ వ్యాక్సిన్ వేయాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎంత ఖర్చవుతుంది? దీనిపైనే ఇండియా రేటింగ్స్ అనే సంస్థ అధ్యయనం చేసింది. దానికి సంబంధించి పరిశోధనా పత్రాన్ని విడుదల చేసింది.

అంతమందికి వ్యాక్సిన్ వేయాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.67,193 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుందని పేర్కొంది. అందులో కేంద్ర ప్రభుత్వానికి రూ.20,870 కోట్లు, అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు కలిపి రూ.46,323 కోట్లు అవసరమవుతాయని వెల్లడించింది. అంటే మొత్తంగా వ్యాక్సినేషన్లపై భారత్ జీడీపీలో 0.36 శాతం ఖర్చు చేయాల్సి ఉంటుందని పేర్కొంది.

దేశ ఎకానమీలో అది చాలా చిన్నమొత్తమేనని తెలిపింది. కేంద్ర బడ్జెట్ లో జీడీపీపై దాని ప్రభావం 0.12 శాతంగా, రాష్ట్ర జీడీపీల్లో 0.24 శాతంగా ఉంటుందని పేర్కొంది. కాగా, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.5,090 కోట్లు ఖర్చు చేసి 21.4 కోట్ల డోసులను సమీకరించిందని వెల్లడించింది. ఇక, మిగిలిన 155.4 కోట్ల డోసులకు రూ.62,103 కోట్లను ఖర్చు చేస్తే సరిపోతుందని చెప్పింది. దేశంలోని కార్పొరేట్ గ్రూప్ లు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపడితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మీద భారం తగ్గుతుందని ఇండియా రేటింగ్స్ అభిప్రాయపడింది.

More Telugu News