Raja Singh: కేటీఆర్ మాట్లాడింది నిజమా? లేక ఈటల రాజేందర్ మాట్లాడింది నిజమా?: రాజాసింగ్

  • చేతకానితనాన్ని తప్పించుకునేందుకు కేంద్రంపై విమర్శలు చేస్తున్నారు
  • ఆసుపత్రుల్లో మౌలికవసతులు పెంచడం లేదు
  • వ్యాక్సిన్ వేయించుకోవాలని కేసీఆర్ ఒక్కరోజైనా కోరారా?
Raja Singh fires on TRS

కరోనా విషయంలో ప్రజలకు ధైర్యాన్ని ఇవ్వాల్సిన తెలంగాణ మంత్రులు... రాజకీయాలు చేయడం దారుణమని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తన చేతకాని తనాన్ని తప్పించుకునేందుకు... కేంద్రంపై విమర్శలు చేస్తోందని మండిపడ్డారు. బట్ట కాల్చి ఇతరుల మీద వేయడాన్ని మానుకోవాలని అన్నారు.

కరోనా వ్యాక్సిన్ విషయంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సరికాదని... కేంద్ర ప్రభుత్వం నుంచి గైడ్ లైన్స్ రాకముందే విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు. 45 ఏళ్లు పైబడిన అందరికీ కేంద్రం వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తోందని... తెలంగాణ ఆసుపత్రుల్లో మౌలికవసతులను పెంచడం మానేసి, కేటీఆర్ కేంద్రంపై విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

రెమ్ డిసివిర్ విషయంలో కేటీఆర్ నిన్న మాట్లాడింది నిజమా? లేక ఈరోజు ఈటల రాజేందర్ మాట్లాడింది నిజమా? అని రాజాసింగ్ ప్రశ్నించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతను ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తన బాధ్యతలను మర్చిపోయి, సెంటిమెంటుతో నెగ్గుకురావాలని అనుకుంటోందని మండిపడ్డారు. అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరోజైనా కోరారా? అని ప్రశ్నించారు. సీఎంఆర్ఎఫ్ కు వచ్చిన నిధులను ఎక్కడ ఖర్చు చేశారో రాష్ట్రం ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్ చేశారు.

More Telugu News