Hero Motocorp: దేశంలోని అన్ని ప్లాంట్లలో కార్యకలాపాలను ఆపేసిన హీరో మోటోకార్ప్!

  • కరోనా నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న హీరో మోటోకార్ప్
  • నాలుగు రోజుల పాటు అన్ని ప్లాంట్లలో లాక్ డౌన్
  • స్థానిక పరిస్థితులను బట్టి ఆయా ప్లాంట్లలో లాక్ డౌన్ కొనసాగింపు
  • వాహనదారుల డిమాండ్ పై ప్రభావం పడదన్న హీరో
Hero Motocorp announces lockdown in manufacturing units

మన దేశంలో అతిపెద్ద ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ అయిన హీరో మోటోకార్ప్ అన్ని ప్లాంట్లలో కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించింది. దేశంలో కరోనా తీవ్రత అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఓ ప్రకటన ద్వారా హీరో తెలిపింది. తమ గ్లోబల్ పార్ట్స్ సెంటర్ లో కూడా కార్యకలాపాలను ఆపేస్తున్నట్టు వెల్లడించింది.

ఈ లాక్ డౌన్ సమయంలో అన్ని ప్లాంట్లలో అవసరమైన మెయింటెనెన్స్ పనులను చేపడతామని హీరో తెలిపింది. లాక్ డౌన్ వల్ల వాహనదారుల డిమాండ్ పై ప్రభావం పడదని పేర్కొంది. తమ ఉత్పాదకతను లాక్ డౌన్ తర్వాత పెంచుతామని చెప్పింది.

రేపటి నుంచి నాలుగు రోజుల పాటు లాక్ డౌన్ కొనసాగుతుందని... ప్లాంట్లు ఉన్న ప్రాంతాల్లోని పరిస్థితులను బట్టి మే 1 వరకు కూడా లాక్ డౌన్ ను కొనసాగించే అవకాశం ఉందని తెలిపింది. తమ సంస్థకు చెందిన కార్పొరేట్ కార్యాలయాలన్నీ ఇప్పటికే వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేస్తున్నాయని చెప్పింది. అతి తక్కువ మంది ఉద్యోగులు మాత్రమే రొటేషన్ బేసిస్ మీద కార్యాలయాలకు వస్తున్నారని తెలిపింది. అత్యవసర సేవల కోసం వీరు కార్యాలయాలకు వస్తున్నారని పేర్కొంది.

More Telugu News