North Korea: బాలిస్టిక్ క్షిపణి ప‌రీక్ష‌కు సిద్ధ‌మైన ఉత్త‌ర కొరియా

  • జలాంతర్గామి నుంచి ప‌రీక్ష‌
  • మూడు వేల టన్నుల బరువుండే జలాంతర్గామి
  • మూడు క్షిపణులను మోహరించే వీలు
north korea ready for one more missile test

ఓ వైపు ప్ర‌పంచం క‌రోనా మ‌హమ్మారితో పోరాడుతూ క్లిష్ట‌ ప‌రిస్థితులను ఎదుర్కొంటుంటే.. మరోవైపు ఉత్తర కొరియా మాత్రం త‌న ప‌ని తాను చేసుకుపోతోంది. జలాంతర్గామి నుంచి అణ్వ‌స్త్ర‌ బాలిస్టిక్ క్షిపణిని త్వ‌ర‌లోనే ప‌రీక్షించ‌డానికి ఉత్తర కొరియా సిద్ధ‌మైన‌ట్లు తెలిసింది.  

మూడు వేల టన్నుల బరువుండే ఆ జలాంతర్గామిలో మూడు క్షిపణులను మోహరించే వీలుంటుంది. దాని నుంచి ప్ర‌యోగించే పుక్‌గుక్సన్-3 క్షిపణికి 1,900 కిలోమీటర్ల స్ట్రయిక్ రేంజ్ ఉంటుంద‌ని నిపుణులు అంటున్నారు. అమెరికాపై ఉత్త‌ర‌కొరియా దాడి చేయాలంటే ఇది 12 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుంది.  

ఈ పరీక్ష ద్వారా ఉత్త‌ర‌కొరియా పసిఫిక్ మహాసముద్రం నుంచి గువామ్, హవాయి, అమెరికాలను లక్ష్యంగా చేసుకోవచ్చని తెలుస్తోంది. ఉత్త‌ర‌కొరియా పాల్ప‌డుతోన్న ఈ చ‌ర్య‌లు ఈశాన్య ఆసియాతో పాటు అమెరికాకు ముప్పుగా ప‌రిణ‌మిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

ఉత్తర కొరియా షిన్పో షిప్‌యార్డ్‌లో ఎంతో కాలంగా ఈ ప్రాజెక్టు కొన‌సాగింది. దానిని అమెరికా నిపుణులు సునిశితంగా గ‌మనిస్తున్నారు. 2019 జులైలో ఉత్తర కొరియా అధినేత‌ కిమ్ జోంగ్ ఉన్ ఆ షిప్‌యార్డ్‌ను సందర్శించిన తర్వాత జలాంతర్గామి ఫొటోను అక్క‌డి అధికారులే విడుదల చేశారు.  

More Telugu News