Somireddy Chandra Mohan Reddy: నువ్వా లోకేశ్ గురించి మాట్లాడేది?: కాకాణి గోవర్ధన్ పై సోమిరెడ్డి ఫైర్

  • నెల్లూరు జిల్లాలో కాకాణి వర్సెస్ సోమిరెడ్డి
  • గతంలో తాము మత్స్యకార ప్యాకేజీ జీవో తీసుకువచ్చామన్న సోమిరెడ్డి
  • నిధులు విడుదల చేసుంటే రాజీనామా చేస్తానన్న కాకాణి
  • జీవో పత్రాలు ప్రదర్శించిన సోమిరెడ్డి
  • ఎప్పుడు రాజీనామా చేస్తావంటూ నిలదీత
Somireddy fires on YCP MLA Kakani Govardhan

వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. నారా లోకేశ్ కాలి గోటికి కూడా సరిపోని నువ్వా ఆయన గురించి నోటికొచ్చినట్టు మాట్లాడేది? అని మండిపడ్డారు. లోకేశ్ పై ఆరోపణలు చేసే ముందు కాకాణి తన స్థాయి తెలుసుకోవాలని హితవు పలికారు.  నెల్లూరులో సోమిరెడ్డి మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ ఒక మాయగాడు అని విమర్శించారు. ఎన్నికల కోడ్ వచ్చిందని మత్స్యకార ప్యాకేజీ పంపిణీ అడ్డుకుంది కాకాణి గోవర్ధనే అని సోమిరెడ్డి ఆరోపించారు. గతంలో టీడీపీ ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమం కోసం రూ.44.22 కోట్లతో ప్యాకేజీ ప్రకటించి, జీవో ఎంఎస్ 8ని జారీ చేసిందని వివరించారు. అయితే, నాటి ఆ ప్యాకేజీలో భాగంగా నిధులు నిజంగా విడుదల చేసుంటే రాజీనామా చేస్తానని కాకాణి ప్రకటించారని సోమిరెడ్డి వెల్లడించారు. నిధుల విడుదలకు సంబంధించిన ఆ జీవో పత్రాలను తాను అందరికీ చూపిస్తున్నానని, మరి కాకాణి ఏ నిర్ణయం తీసుకుంటారని నిలదీశారు.

తోడేరు బుడ్డారెడ్డి అలియాస్ కాకాణి గోవర్ధన్... మత్స్యకార ప్యాకేజీ నిధులకు సంబంధించిన జీవో ఇదిగో... ఎప్పుడు రాజీనామా చేస్తావ్ అని ప్రశ్నించారు. గతంలో నకిలీ పత్రాలు సృష్టించిన కేసులో తప్పించుకుని తిరిగిన విషయం గుర్తుంచుకోవాలని వ్యాఖ్యానించారు.

More Telugu News