Cyber Criminals: కాల్ హైజాక్ చేసి ఇంటెలిజెన్స్ అధికారిణిని బోల్తాకొట్టించిన సైబర్ నేరగాళ్లు

  • సైబర్ క్రిమినల్స్ చేతిలో మోసపోయిన అధికారిణి
  • 'మేక్ మై ట్రిప్' ద్వారా విమాన టికెట్లు బుకింగ్
  • ప్రయాణ తేదీలు మార్చుకునేందుకు కస్టమర్ కేర్ కు ఫోన్
  • మధ్యలోనే ఆగిపోయిన కాల్
  • కస్టమర్ కేర్ పేరిట వల విసిరిన సైబర్ నేరగాళ్లు
Cyber criminals cheated Intelligence officer

సైబర్ నేరగాళ్ల చేతిలో ఓ ఇంటెలిజెన్స్ అధికారిణి మోసపోయిన ఘటన వెల్లడైంది. ఏపీలోని కృష్ణా జిల్లా పెనమలూరు ప్రాంతానికి చెందిన ఆ అధికారిణి కేంద్ర ఇంటెలిజెన్స్ సర్వీసులో విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల ఆమె విదేశాలకు వెళ్లేందుకు 'మేక్ మై ట్రిప్' పోర్టల్ ద్వారా ఫ్లయిట్ టికెట్లు కొనుగోలు చేశారు. అయితే ఆమె తన ప్రయాణ తేదీలను మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. దాంతో ఇంటర్నెట్ లో వెదికి 'మేక్ మై ట్రిప్' కస్టమర్ కేర్ నెంబర్ కు ఫోన్ చేశారు. ఆ ఫోన్ కాల్ సగంలోనే కట్ అయింది.

అయితే సైబర్ నేరగాళ్లు తన కాల్ ను హైజాక్ చేశారని ఆ ఇంటెలిజెన్స్ అధికారిణి గుర్తించలేకపోయారు. కాసేపటికి ఆమె ఫోన్ కు ఓ కాల్ వచ్చింది. తాము 'మేక్ మై ట్రిప్' కస్టమర్ కేర్ నుంచి ఫోన్ చేస్తున్నామని వెల్లడించారు. ఆమె సమస్యను విన్న అనంతరం వారు ఓ లింకును ఆమె ఫోన్ నెంబరుకు పంపారు. ఆ లింకుపై క్లిక్ చేయగానే, ఆ అధికారిణి బ్యాంకు ఖాతా నుంచి రూ.1,62,999 సైబర్ నేరగాళ్ల వ్యాలెట్ ఖాతాలోకి వెళ్లిపోయాయి.

దాంతో జరిగిన మోసం గుర్తించిన ఆ ఇంటెలిజెన్స్ అధికారిణి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు ఆ వ్యాలెట్ ఖాతాను వెంటనే స్తంభింపచేశారు. ఆపై ఒకటిన్నర లక్షల రూపాయలను ఆమె ఖాతాలోకి తిరిగి జమ చేయించారు. కాగా, కాల్ హైజాక్ చేయడానికి ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానంతోనే సైబర్ నేరగాళ్లు ఫోన్లకు వచ్చే ఓటీపీలను కూడా దారిమళ్లిస్తుంటారు. ఆ విధంగానూ భారీ మోసాలకు తెరదీస్తుంటారు.

More Telugu News