Rajasthan: రైతు నేత రాకేశ్‌ తికాయత్‌ కాన్వాయ్‌పై దాడి

  • రాజస్థాన్‌లోని అల్వార్‌ జిల్లాలో ఘటన
  • బీజేపీ గూండాల పనే అని ఆరోపణ
  • ఖండించిన రైతు సంఘాలు
  • నిరసనగా ఘాజీపూర్‌ వద్ద రోడ్డు దిగ్బంధం
Tikat Convoy was attacked in Rajasthan

కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న భారతీయ కిసాన్‌ యూనియన్‌(బీకేయూ) నేత రాకేశ్‌ తికాయత్‌ కాన్వాయ్‌పై శుక్రవారం దాడి జరిగింది. రాజస్థాన్‌లోని అల్వార్‌ జిల్లా తాతార్‌పూర్‌ గ్రామంలో ఈ ఘటన జరిగింది.

వివరాల్లోకి వెళితే.. తికాయత్‌ రాజస్థాన్‌లోని హర్సోరా ప్రాంతంలో రైతు ఉద్యమ మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించారు. అక్కడి నుంచి బన్సూర్‌కు బయలుదేరారు. మార్గమధ్యంలో గుర్తు తెలియని దుండగులు ఆయన కాన్వాయ్‌పై దాడికి దిగారు. ఈ ఘటనలో ఆయన కారు స్వల్పంగా ధ్వంసమైంది.

ఇది బీజేపీ గూండాల పనే అని రాకేశ్‌ తికాయత్‌ ఆరోపించారు.  కారు ధ్వంసమైనట్లు చూపుతున్న వీడియోని ట్విటర్‌లో పంచుకున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని వ్యాఖ్యానించారు.

మరోవైపు ఈ ఘటనను ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమిస్తున్న రైతులు తీవ్రంగా ఖండించారు. దీనికి నిరసనగా ఢిల్లీ-ఉత్తర్‌ప్రదేశ్‌ రహదారిపై ఘాజీపూర్‌ వద్ద రోడ్డును దిగ్బంధించారు. దీంతో భారీ స్థాయిలో ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. రంగంలోకి దిగిన పోలీసులు రైతులను చెదరగొట్టి ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు.

More Telugu News