COVID19: కరోనా వ్యాక్సినేషన్​ పై కేంద్రం కీలక నిర్ణయం

  • ఈ నెల మొత్తం టీకాలు వేయాలని రాష్ట్రాలకు లేఖ
  • సెలవు దినాల్లోనూ వ్యాక్సినేషన్ చేయాలని సూచన
  • కరోనా కేసులు పెరుగుతుండడంతో నిర్ణయం
Vaccination Throughout April Including Holidays Government Amid Surge

కరోనా కేసులు పెరిగిపోతుండడం.. సెకండ్ వేవ్ మొదలైపోయిందని అధికారులు చెబుతుండడంతో.. కరోనా వ్యాక్సినేషన్ పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటిదాకా వారంలో కొన్ని రోజులు మాత్రమే టీకాలను వేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఏప్రిల్ నెలంతా కరోనా టీకాలను వేయాలని కేంద్రం నిర్ణయించింది.

దీనిపై బుధవారమే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలతో చర్చలు జరిపిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా సెలవు దినాల్లోనూ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టాల్సిందిగా ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలకు లేఖ రాసింది.

దానికి అనుగుణంగా కరోనా టీకాల పంపిణీకి ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది. కరోనా టీకాల పంపిణీ కార్యక్రమంలో వేగం పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పింది. ఈ రోజు నుంచి 45 ఏళ్లు దాటిన వారందరికీ టీకాలు వేయాలని సూచించింది. నేషనల్ ఎక్స్ పర్ట్ గ్రూప్ సూచనల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామంది. కాగా, గురువారం ఒక్కరోజే రికార్డ్ స్థాయిలో 72,330 కేసులు నమోదయ్యాయి.

More Telugu News