Sake Sailajanath: ప్రజలకు పవన్ సమాధానం చెప్పాలి: శైలజానాథ్ డిమాండ్

  • ప్రత్యేకహోదా ఇస్తామని తిరుపతిలో మోదీ ప్రకటించారు
  • మోసం చేసిన బీజేపీకి తిరుపతిలో పోటీ చేసే హక్కు లేదు
  • బీజేపీతో చేతులు కలిపేందుకు చంద్రబాబు ఆరాటపడుతున్నారు
Pawan has to answer to people says Sailajanath

ఆంధ్రప్రదేశ్ కు బీజేపీ ఇంతవరకు చేసిందేమీ లేదని కాంగ్రెస్ నేత శైలజానాథ్ విమర్శించారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామంటూ తిరుపతి వేదికగా మోదీ ప్రకటించారని... ఆ తర్వాత మాట తప్పారని దుయ్యబట్టారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వలేమని కేంద్రం చెపుతోందని... ఏపీకి కాకపోతే పుదుచ్చేరికి ఇస్తారా? అని ఎద్దేవా చేశారు.

మోసం చేసిన బీజేపీకి తిరుపతిలో పోటీ చేసే హక్కు లేదని అన్నారు. ఏపీకి పాచిపోయిన లడ్డూలు ఇచ్చారంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ గతంలో బీజేపీపై విమర్శలు చేశారని... ఇప్పుడు అదే పార్టీతో చేతులు కలిపినందుకు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్తులను కేంద్రం అమ్మేస్తుంటే వైసీపీ ప్రభుత్వం చోద్యం చూస్తోందని శైలజానాథ్ విమర్శించారు. కేంద్రాన్ని వైసీపీ ప్రశ్నించలేకపోతోందని... రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ముఖ్యమంత్రి జగన్ పోరాటం చేయాలని అన్నారు. బీజేపీతో మళ్లీ చేతులు కలిపేందుకు చంద్రబాబు ఆరాటపడుతున్నారని ఎద్దేవా చేశారు.

More Telugu News