Green Tax: 15 ఏళ్లు దాటిన 4 కోట్ల పాత వాహనాలపై హరిత పన్ను

  • వెల్లడించిన కేంద్ర రవాణా శాఖ
  • కర్ణాటకలో ఎక్కువగా 70 లక్షల వాహనాలు
  • తెలంగాణ, ఏపీ వివరాలు లేవన్న కేంద్రం
Green tax Over 4 crore vehicles on Indian roads are older than 15 years says Centre

పాత వాహనాలపై హరిత పన్ను విధించేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అవుతోంది. 15 ఏళ్లకు పైబడిన 4 కోట్ల వాహనాలపై హరిత పన్నును విధించబోతున్నట్టు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ ప్రకటించింది. అందులో కర్ణాటకవే 70 లక్షల దాకా పాత వాహనాలున్నట్టు చెప్పింది.

అయితే, తెలుగు రాష్ట్రాల వివరాలు అందుబాటులో లేకపోవడంతో వాటిని వెల్లడించలేదు. మధ్యప్రదేశ్, లక్షద్వీప్ ల వివరాలూ కేంద్రం వద్ద లేవట. ఈ ఏడాది జనవరిలోనే హరితపన్నుపై కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. ఆ ప్రతిపాదనను ఇప్పుడు అమలు చేయడానికి సిద్ధమైంది.

4 కోట్ల పాత వాహనాల్లో సగానికిపైగా 20 ఏండ్ల పైబడిన వాహనాలేనని కేంద్రం చెప్పింది. కర్ణాటక తర్వాత అత్యధిక పాత వాహనాలున్న రాష్ట్రాల జాబితాలో ఉత్తరప్రదేశ్ నిలిచింది. ఆ రాష్ట్రంలో 56.54 లక్షల పాత వాహనాలు రోడ్లపై తిరుగుతున్నాయి. అందులో 24.55 లక్షల వాహనాలు 20 ఏండ్లకు పైనవే కావడం గమనార్హం. 49.93 లక్షల పాత వాహనాలతో ఢిల్లీ మూడోప్లేస్ లో ఉంది. ఆ రాష్ట్రంలో 20 ఏండ్లకు పైబడిన 35.11 లక్షల పాత వాహనాలున్నాయి. కేరళలో 15 ఏళ్లకు పైబడిన వాహనాలు 34.64 లక్షలుంటే.. తమిళనాడులో 33.43 లక్షలున్నాయి.

పంజాబ్ లో 25.38 లక్షలు, పశ్చిమ బెంగాల్ లో 22.69 లక్షలున్నాయి. మహారాష్ట్ర, ఒడిశా, గుజరాత్, రాజస్థాన్, హర్యానాల్లో 17.58 లక్షల నుంచి 12.29 లక్షల వరకున్నాయి. ఝార్ఖండ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్ గఢ్, హిమాచల్ ప్రదేశ్, పుదుచ్చేరి, అసోం, బీహార్, గోవా, త్రిపుర, దాద్రానగర్ హవేలి, డామన్ అండ్ డయ్యూల్లో లక్ష నుంచి 5.44 లక్షల వరకు పాత వాహనాలున్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వాటన్నింటిపైనా ఇప్పుడు కేంద్రం హరిత పన్నును వసూలు చేయనుంది. 8 ఏళ్లు దాటిన వాణిజ్య వాహనాలపై 10 నుంచి 25 శాతం వరకు పన్నులు వసూలు చేయనుంది.

More Telugu News