Double Mutant: భారత్ లో కరోనా డబుల్ మ్యూటెంట్లు... వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందంటున్న నిపుణులు

  • జన్యుమార్పులకు గురవుతున్న కరోనా వైరస్
  • భారత్ లో డబుల్ మ్యూటెంట్ రకాలు
  • ఒకే వైరస్ లో రెండు జన్యు ఉత్పరివర్తనాలు
  • రెండోసారి కూడా కరోనా సోకే అవకాశాలు
Double mutant corona virus variants identified in India

భారత్ లో గత కొన్నిరోజులుగా కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అనేక రాష్ట్రాల్లో తాజా కేసుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతోంది. అయితే ఆందోళన కలిగించే రీతిలో దేశంలో కొన్నిచోట్ల డబుల్ మ్యూటెంట్ కరోనా రకాలను గుర్తించారు. ఒకే వైరస్ లో రెండు జన్యు ఉత్పరివర్తనాలు ఉండడాన్నే డబుల్ మ్యూటెంట్ గా పేర్కొంటారు.

ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే క్రమంలో కరోనా వైరస్ జన్యుపరమైన మార్పులకు లోనవుతుంది. తద్వారా వైరస్ లోని స్పైక్ ప్రొటీన్లు మానవ దేహంలోని కణాలలోకి పెద్ద సంఖ్యలో ప్రవేశిస్తాయి. దాంతో మానవుడి రోగనిరోధక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమవుతుంది. ఇక డబుల్ మ్యూటెంట్ వేరియంట్లతో ఈ ముప్పు మరింత అధికంగా ఉంటుందని, వేగంగా వ్యాప్తి చెందే సామర్థ్యాన్ని సంతరించుకుంటాయని నిపుణులు చెబుతున్నారు.

 కాగా, తొలినాళ్లలో వెలుగు చూసిన వైరస్ లతో పోల్చితే జన్యు మార్పులకు లోనైన వైరస్ లపై వ్యాక్సిన్లు కూడా ఏమంత ప్రభావం చూపవని ఓ వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ లోని 18 రాష్ట్రాల్లో డబుల్ మ్యూటెంట్ వేరియంట్ వ్యాప్తిలో ఉందన్న వార్తలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.

మ్యూటేషన్లు మరింత దీర్ఘకాలం పాటు కొనసాగితే వైరస్ తన స్వభావాన్ని, లక్షణాలను కూడా మార్చుకుని ప్రత్యేక వైరస్ గా మారే అవకాశాన్ని కొట్టిపారేయలేమని లూసియానా స్టేట్ యూనివర్సిటీ వైరాలజిస్టు డాక్టర్ జెరెమీ కామిల్ పేర్కొన్నారు. భారత్ లో కనిపిస్తున్న డబుల్ మ్యూటేషన్ వేరియంట్లపై కామిల్ పరిశోధన చేస్తున్నారు.

భారత్ లో గుర్తించిన E484Q కరోనా వైరస్ రకం E484K వైరస్ తో సారూప్యత కనబరుస్తోందని అన్నారు. ఈ డబుల్ మ్యూటేషన్ వేరియంట్లు బ్రెజిల్, దక్షిణాఫ్రికా వేరియంట్లలోనూ కనిపిస్తున్నాయని వివరించారు. ప్రధానంగా మ్యూటేషన్ కు గురైన కరోనా వైరస్ లు ఒకసారి కరోనా బారినపడిన వ్యక్తికి మళ్లీ కరోనా సోకేలా చేయగలవని వెల్లడించారు.

More Telugu News