Bangladesh: బంగ్లా ప్రధాని 'షేక్ హసీనా హత్యకు కుట్ర' కేసులో... 14 మందికి మరణశిక్ష విధించిన న్యాయస్థానం!

  • మొత్తం 14 మందిపై కేసు, 9 మంది అరెస్ట్
  • 2000 సంవత్సరంలో కుట్ర
  • అప్పీలుకు అవకాశం ఇస్తామన్న న్యాయమూర్తి
CapitalPunishment for 14 Militents in Bangladesh

బంగ్లాదేశ్ లో దాదాపు 20 సంవత్సరాల క్రితం అప్పటి ప్రధాని షేక్ హసీనా హత్యకు  కుట్ర చేసి, దాన్ని అమలు చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలపై విచారించిన కోర్టు, 14 మందికి మరణశిక్షను విధించింది. వీరంతా ఇస్లామిక్ మిలిటెంట్లేనని ఈ సందర్భంగా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. మొత్తం 14 మందిపై హత్యాయత్నం కేసు నమోదు కాగా, పోలీసులు 9 మందిని అరెస్ట్ చేశారు. మిగతా వారంతా ఇప్పటికీ పరారీలో ఉన్నారు.

కాగా, 1975 నుంచి హసీనా పలుమార్లు హత్యా ప్రయత్నాల నుంచి తప్పించుకున్నారు. తాజా కేసులో వీరందరినీ ఫైరింగ్ స్క్వాడ్ తో కాల్చి చంపాలని లేదా ఉరి తీయాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఈ తీర్పుపై నిందితులు అప్పీలుకు వెళ్లవచ్చని స్పష్టం చేశారు. హర్కతుల్ జీహాద్ బంగ్లాదేశ్ కు చెందిన వీరంతా 2000 సంవత్సరంలో హసీనా హత్యకు కుట్ర చేశారన్నది ప్రధాన అభియోగం.

ఇదిలావుండగా, హర్కతుల్ జీహాద్ కు చెందిన నేత ముఫ్తీ అబ్దుల్ హసన్ కు మరో కేసులో 2017లో మరణ శిక్ష అమలైన సంగతి గుర్తుండే ఉంటుంది. అప్పట్లో ప్రధాని హత్యకు కుట్ర జరుగగా, హసన్ తో పాటు మరో 10 మందికి మరణశిక్షను అధికారులు అమలు చేశారు.

More Telugu News