Indian Army: సైన్యానికి 1300 వాహనాలను అందించనున్న మహీంద్రా

  • తేలికపాటి సాయుధ వాహనాల కొనుగోలుకు ఒప్పందం
  • నాలుగేళ్లలో 1300 వాహనాలు అందించేందుకు అంగీకారం
  • రక్షణరంగంలో ఆత్మనిర్భర్‌కు బాటలు
  • అన్ని రకాల పరిస్థితుల్లో వాహనాన్ని పరీక్షించిన సైన్యం
Mahindra is going to hand over 13k vehicles to Indian Army

దేశీయ ఆటోమొబైల్‌ తయారీ సంస్థ మహీంద్రా డిఫెన్స్‌ సిస్టమ్‌ లిమిటెడ్‌ భారత సైనిక దళాలకు వాహనాలను సరఫరా చేయనుంది. మొత్తం 1300 తేలికపాటి సాయుధ వాహనాలను దళాలకు అందించనుంది. ఈ వాహనాలను బలగాలు, ఆయుధాలను తరలించడానికి ఉపయోగించనున్నారు. ఈ ఒప్పంద విలువ రూ.1,056 కోట్లు. వచ్చే నాలుగేళ్లలో మహీంద్రా ఈ వాహనాలను సైన్యానికి అందించాల్సి ఉంటుంది. ఈ వివరాలను మహీంద్రా డిఫెన్స్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌(ఎండీఎస్‌) ఛైర్మన్‌ ఎస్‌.పి శుక్లా మంగళవారం వెల్లడించారు.

ఆత్మనిర్భర్‌ భారత్‌కు ఈ ఒప్పందంతో బాటలు పడనున్నాయని శుక్లా అభిప్రాయపడ్డారు. ప్రైవేటు రంగంలో రూపొందించి తయారు చేసిన ఓ వాహనానికి దక్కిన అతిపెద్ద సైనిక కాంట్రాక్టని ఆయన తెలిపారు. దీంతో భారత్‌లో తయారైన సైనిక పరికరాల వినియోగానికి బాటలు పడనున్నాయన్నారు.

మరోవైపు భారత సైనికదళాల ప్రమాణాలకు అనుగుణంగా ఎండీఎస్‌ సంస్థ ఈ వాహనాలను అభివృద్ధి చేయనుంది. ఈ వాహనాలకు జీవితకాలం సంస్థ నుంచే సర్వీస్‌ అందనుంది. ఈ కొనుగోలు ఒప్పందానికి ముందు సైన్యం  వాహనంపై అన్ని రకాల పరీక్షలు నిర్వహించింది. వివిధ రకాల భౌగోళిక పరిస్థితుల్లో వాహన సామర్థ్యాన్ని పరీక్షించింది. పేలుళ్లకు తట్టుకొనే శక్తిని నిర్ధారించింది. ఈ తరహా వాహనాల్లో ఓ వేరియంట్‌ను సైన్యం ఇప్పటికే వినియోగిస్తుండడం గమనార్హం.

More Telugu News