BJP: కేరళలో బీజేపీకి షాక్.. ముగ్గురు ఎన్డీయే అభ్యర్థుల నామినేషన్ తిరస్కరణ

  • నడ్డా సంతకం లేకపోవడంతో ఇద్దరు బీజేపీ అభ్యర్థుల నామినేషన్ తిరస్కరణ
  • హైకోర్టును ఆశ్రయించిన అభ్యర్థులు
  • నామినేషన్ పత్రాలు సంపూర్ణంగా లేకపోవడంతో అన్నాడీఎంకే అభ్యర్థికి షాక్
3 NDA Cadidates nominations rejected in Kerala

దక్షిణాదిలో కర్ణాటక మినహా ఇతర రాష్ట్రాల్లో బీజేపీకి పెద్దగా పట్టు లేదనే విషయం తెలిసిందే. తెలంగాణలో మాత్రం కొంత మేర ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఫలితాలను రాబట్టాలని కాషాయ పార్టీ పట్టుదలగా ఉంది.

 అయితే, బీజీపీకి కేరళలో ఊహించని షాక్ తగిలింది. ఎన్డీయే కూటమికి చెందిన ముగ్గురు అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. తాలసెర్రీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఎన్.హరిదాస్ నామినేషన్ పత్రంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సంతకం లేకపోవడంతో ఆయన నామినేషన్ ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు.

గురువాయూర్ బరిలోకి దిగిన బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు నివేదిత సుబ్రమణియం నామినేషన్ కూడా ఇదే కారణంగా తిరస్కరణకు గురైంది. దీంతో వీరు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈసీకి  నోటీసులు జారీ చేసింది. సోమవారంలోగా స్పందనను తెలియజేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇడుక్కి నియోజకవర్గంలో అన్నాడీఎంకే అభ్యర్థి ధనలక్ష్మి నామినేషన్ పత్రాలు సంపూర్ణంగా లేకపోవడంతో... ఆమె నామినేషన్ ను తిరస్కరించారు. కేరళలో అన్నాడీఎంకే అభ్యర్థికి బీజేపీ మద్దతునిస్తోంది.

More Telugu News